మోడీ క్యాబినెట్లో చేరుతాం: బాబు, జగన్ భేటీపైనా
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరబోతోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం, తెలుగు జాతి ప్రయోజనం కోసం బిజెపితో పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పారు. కేంద్రంలో ఇప్పటి వరకు వచ్చిన ఐదు కాంగ్రెసేతర ప్రభుత్వాలు నాలుగు ప్రభుత్వాలు తమ సహకారంతో వచ్చాయని ఆయన అన్నారు. ఎన్డియె సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నరేంద్ర మోడీని కలవడం అంశమే కాదని చంద్రబాబు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిట్టినవాళ్లు కూడా వస్తున్నారని ఆయన అన్నారు. బిజెపి నేతలతో జగన్ భేటీపై వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మోడీతో జగన్ భేటీ కావడం మీడియాకు అంశం కావచ్చు గానీ తనకు కాదని ఆయన చెప్పారు. మోడీ పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని ఆయన చెప్పారు. మోడీకి చాలా ఆలోచనలున్నాయని, అందువల్ల ఉమ్మడి కనీస కార్యక్రమం అవసరం లేదని ఆయన అన్నారు.

ప్రతిరోజూ కొత్త ఆలోచనలు వస్తుంటాయని, అవే ఉమ్మడి కనీస కార్యక్రమాలని ఆయన అన్నారు. తనకు ఎంత నిబద్ధత ఉందో మోడీకి అంతే నిబద్ధత ఉన్నదని, సీమాంధ్రకు న్యాయం చేస్తామని మోడీ చెప్పారని, తెలంగాణలోని విద్యుత్తు, సాగునీటి సమస్యలపై కూడా పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రను పునాది స్థాయి నుంచి నిర్మించాలని, తెలంగాణలో సామాజిక తెంలగాణను స్థాపించాలని ఆయన అన్నారు.
మోడీ ప్రధాని కావడం శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ రోజు దేశానికి శుభదినమని ఆయన అన్నారు. కాంగ్రెసు పీడ విరగడైందని ఆయన అన్నారు. తమతో బిజెపి పొత్తు ప్రతిపాదన వచ్చినప్పుడు 300కు పైగా లోకసభ స్థానాలు వస్తాయని చెప్పాయని, ఇప్పుడు 335 వరకు వచ్చాయని ఆయన అన్నారు. తెలుగుజాతికి పూర్వవైభవం తెస్తామని ఆయన అన్నారు. మోడీ పాలనలో తెలుగు ప్రజలకు చెందిన రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు వల్ల తెలుగు జాతి అభద్రతా భావానికి గురైందని ఆయన అన్నారు.
తెలుగు ప్రజలు అభద్రతా భావానికి గురైనప్పుడు తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పాదయాత్రలో సమస్యలు గుర్తించి సీమాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా తనకు ఎనలేని గౌరవం దక్కిందని ఆయన చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెసు చిత్తుగా ఓడిందని, ప్రజలు తనను గౌరవించారని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెసును ఓడించారని ఆయన అన్నారు. హైదరాబాదులో ఉండే తెలుగువారికి అండగా ఉంటామని ఆయన చెప్పారు.
తెరాస అధ్యక్షుడు కెసిఆర్ అభివృద్ధి చేయలేదని, కాంగ్రెసు చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణలో అభివృద్ధి అంతా తానే చేశానని ఆయన చెప్పారు. పోటీ పడి అన్నదమ్ముల్లా ముందుకు పోయే పరిస్థితి తెస్తామని ఆయన చెప్పారు. వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాను, మోడీ తప్పు చేయలేదు కాబట్టి వ్యవస్థను ప్రక్షాళణ చేస్తామని ఆయన అన్నారు.
తాను ఎన్నికల కోసం కాకుండా దేశం కోసం, రాష్ట్రం కోసం వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారని, పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఎప్పటికప్పుడు తీసుకుంటామని ఆయన చెప్పారు. తాను సీమాంద్రలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, పరిపాలన కూడా త్వరలో అక్కడి నుంచే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications