బెదిరించి, కిడ్నాప్ చేసి కారులోనే టెక్కీపై రేప్ యత్నం

మాదాపూర్ పోలీసుల వివరాల మేరకు.. హిమయత్ సాగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఖాజాగూడలోని ఓ గుడికి వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తూ కారు తలుపు తీయగా అప్పటికే గుర్తు తెలియని యువకుడు వెనుక సీటులో ఉండటం ఆమె గమనించారు. అంతకుముందు ఆమె డోర్ లాక్ చేయలేదు. దీంతో అతను కారులోనికి ప్రవేశించాడు.
ఆమె వెంటనే కారు తలుపు వేయబోగా.. అతను తన వద్ద ఉన్న కత్తితో లోపలకు వచ్చి కూర్చోమని బెదిరించాడు. అనంతరం ఔటర్ రింగు రోడ్డు మీదుగా కారును పోనివ్వాలని చెప్పి, కొంతదూరం వచ్చాక టెక్కీపై అత్యాచారయత్నం చేశాడు. అంతకుముందే ఆమె తన స్నేహితులకు తాను కిడ్నాప్కు గురైనట్లు ఫోన్ ద్వారా సందేశం పంపిచారు. ఆ స్నేహితురాలు కంట్రోల్ రూంకు ఫోన్ చేశారు.
వెంటనే స్పందించిన పోలీసులు సైబరాబాద్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. పెట్రోలింగ్ వాహనాలను అప్రమత్తం చేశారు. మరోవైపు, హిమయత్ సాగర్ సమీపంలో సదరు యువకుడు టెక్కీని కారు ఆపమని చెప్పి దిగిపోయాడు.
బాధితురాలు కిడ్నాప్కు గురైందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. టెక్కీ ఫోన్ పని చేస్తుండటంతో సిగ్నల్స్ ద్వారా ఆమె కారు ఎక్కడికి వెళ్తుందో గుర్తించారు. గచ్చిబౌలి - శంషాబాద్ మార్గంలో వెళ్తుందని తెలుసుకున్నాక అప్పా జంక్షన్లో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సమాచారం ఇచ్చారు.
బాధితురాలి కారు కనిపించగానే సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. హిమయత్ సాగర్ రోడ్డుపై బాధితురాలు తన కారును నిలిపి ఉండగా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆమెకు సంబంధించిన వారికి సమాచారం ఇచ్చారు. అనంతరం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.












Click it and Unblock the Notifications