కిరణ్ సిక్సర్ మాకే లాభం: కోదండరాం, చరిత్ర: అశోక్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కొట్టిన సిక్సర్ తమకే ఉపయోగపడిందని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను కేంద్రం కేవలం అభిప్రాయాలుగానే పరిగణిస్తుందని తెలిపారు. అసెంబ్లీ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలని తెలంగాణ ముసాయిదా బిల్లు పంపారని, అంతిమ నిర్ణయం కేంద్రానిదేనని ఆయన అన్నారు.
బిల్లు అసెంబ్లీని దాటి వెళ్లడం ఒక అడుగు ముందుకెళ్లినట్లేనని కోదండరాం అన్నారు. తెలంగాణ సాధన దిశగా మరో అడుగు ముందుకు పడిందని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పడటం ఖాయమని, తొందరలోనే ఆంధ్రా, తెలంగాణ శాసనసభల్లో సమావేశాలు విడి విడిగా జరుగుతాయని తెలిపారు.

విభజన ప్రక్రియ ముందుకు సాగుతోందని, 20, 25 రోజుల్లో ప్రత్యేక రాష్ట్రంలో ఉంటామని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు విజయోత్సవాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న వాటికి బెదిరిపోవద్దని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొట్టిన సిక్సర్ తమకే ఉపయోపడిందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలకు అభినందనలు: అశోక్ బాబు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభ, శాసనమండలి తిరస్కరించడం చారిత్రక ఘటన అని ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బిల్లును తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటిస్తున్న సమయంలో ఆయనకు అండగా పోడియాన్ని చుట్టుముట్టిన సీమాంధ్ర ఎమ్మెల్యేలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
పార్లమెంటులోనూ బిల్లును ఓడించే విషయంపై రాజకీయ పార్టీలను సంప్రందించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని అశోక్ బాబు తెలిపారు. పార్లమెంటుకు బిల్లు చేరిన సమయంలో చలో ఢీల్లీతోపాటు ఆందోళనలు చేపడతామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 3న జరిగే సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సమావేశంలో తమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు ప్రకటిస్తామని అశోక్ బాబు చెప్పారు.












Click it and Unblock the Notifications