ఇదీ ఆయుధం: ప్రశాంత్ కిషోర్ 'వ్యూహాల'పై బాబు కన్ను, దెబ్బకొట్టేందుకు.., పవన్ పైనా..
2019 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపింది.ప్లీనరీ వేదికగా ఆ పార్టీ అధినేత జగన్ ఆయనను పరిచయం చేశారు.
అమరావతి: 2019 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపింది. ప్లీనరీ వేదికగా ఆ పార్టీ అధినేత జగన్ ఆయనను పరిచయం చేశారు.
ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగడంతో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నేతలు, అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది.
తెర ముందుకు ప్రశాంత్ కిశోర్: జగన్ తప్పిదమా, వ్యూహమా?
ప్రశాంత్ కిషోర్ గురించి మొత్తం చిట్టా టిడిపి అధిష్టానం తెప్పించుకున్నదని తెలుస్తోంది.
ఈ మేరకు ఆయన ఏఏ ఎన్నికలకు పని చేశారు, ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి, ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాలు అమలు పరిచారు, ఇక్కడ (ఏపీ) ఎలా ముందుకు వెళ్తారు... అనే అంశాలపై జాబితా సిద్ధం చేసుకుందని తెలిస్తోంది. ఆయన గురించి మరింత సమాచారం తెప్పించుకొని విశ్లేషించుకుంటోందని తెలుస్తోంది.
ఇదీ ఆయన ప్రధాన అస్త్రం.. తిప్పికొట్టేందుకు టిడిపి సిద్ధం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రధాన అస్త్రం సోషల్ మీడియా. ఇందులో ఆయన చేయి తిరిగిన వ్యూహకర్త. వైసిపికి సోషల్ మీడియా పరంగాను క్రేజ్ తీసుకు వచ్చే అంశంపై ఆయన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తమ సోషల్ మీడియా కేడర్ను టిడిపి ఇప్పటికే అప్రమత్తం చేసిందని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ప్రచారం చేసే ప్రయత్నం చేసినా దానిని తిప్పికొట్టేలా ఉండాలని దిశా నిర్దేశనం చేసిందని తెలుస్తోంది.
Recommended Video
ప్రశాంత్ కిషోర్ ఏం చేశారు
2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీని, బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ను, పంజాబ్ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ను, గెలిపించేందుకు ఆయన ఏ వ్యూహాలు రచించారు, అలాగే ఇక్కడ ఏం చేస్తారనే అంశాలపై టిడిపి దృష్టి సారించింది.
ప్రశాంత్ కిషోర్, వైసిపి మానసిక స్థైర్యం దెబ్బతీసేందుకు..
ప్రశాంత్ కిషోర్, వైసిపి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కూడా టిడిపి వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి పని చేసినప్పటికీ గెలవలేదు. వీటిని పదేపదే ప్రస్తావించడం ద్వారా వైసిపి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని కూడా భావిస్తున్నారని తెలుస్తోంది.
ఆ సూచనలు ప్రశాంత్ కిషోర్వేనా?
ప్రశాంత్ కిషోర్ ఇటీవల వైసిపికి పలు సూచనలు చేశారని, వాటిని వైసిపి అమలు పరిచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే 9 పనులు చేస్తానని జగన్ చెప్పారు. 2014లో చంద్రబాబు ఏం చెప్పారు, జగన్ ఏం చెప్పారు.. 2019 పరిస్థితి ఎలా ఉంటుంది.. అనే వాటిని విశ్లేషించి ప్రశాంత్ కిషోరే ఈ 9 సూచనలు చేశారని తెలుస్తోంది. ఆయన సూచన మేరకే ప్లీనరీలోనే జగన్ ఆ అంశాలపై ప్రకటన చేశారని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ పైనా కన్ను
2014 ఎన్నికల్లో టిడిపి - బిజెపిలు కలిసి పోటీ చేశాయి. జనసేన మద్దతు ఇచ్చింది. 2019లో పరిణామాలు మారనున్నాయి. జనసేన ఒంటరిగా పోటీ చేయనుంది. బిజెపి కలిసి నడుస్తుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సూచనలతో జగన్ వేస్తున్న అడుగులను గమనిస్తూనే, పవన్ కళ్యాణ్ పైన కూడా టిడిపి దృష్టి సారించిందని తెలుస్తోంది.