అది కోడి కత్తి డ్రామా కాదు.. నారా వారి కత్తి డ్రామా అని త్వరలో తెలుస్తుందన్న వైసీపి మాజీ ఎంపీ
హైదరాబాద్ : ఏపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి సంబందించి విచారణను ఎన్ఐఎ సంస్థకు అప్పగించడాన్ని పలువురు వైసీపి నేతలు స్వాగతిస్తున్నారు. వైఎస్.ఉగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన అరగంటలోనే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి నిందితుడు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, జగన్ అభిమాని అని దర్యాప్తు ఏ కోణంలో జరగాలో డిసైడ్ చేసి చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపి పీవీ.మిథున్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిట్ కార్యాలయం పెట్టి లోతుగా విచారణ చేస్తామని చెప్పి ఆ కార్యాలయానికి తాళాలు వేయడం ప్రజలందరూ చూశారని అన్నారు. కేసు ఎన్ఐఏ కి అప్పగించడంతో వాస్తవాలు బయటకు వస్తాయనే ఆశాభావంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది కోడి కత్తి డ్రామా కాదని, నారావారి కత్తి డ్రామా అనేది థర్డ్ పార్టీ విచారణలో తేలుతుందని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై ఇంత పెద్ద కుట్ర జరిగితే కేవలం శ్రీనివాస్ అనే ఒక్క వ్యక్తిని మాత్రమే నిందితుడిగా చూపి మిగిలిన వ్యక్తులెవరినీ వెల్లడించలేదని ఆరోపించారు. ఇవన్నీ కూడా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరగుతున్నాయని భావిస్తున్నట్లు మిథున్ రెడ్డి చెప్పారు. తనపైన ఎక్కడ విచారణ జరుగుతుందో అనే భయంతో చంద్రబాబు సీబీఐ, ఐటీని సైతం వద్దన్నారని, రేపు ఎన్ఐఏని కూడా అడ్డుకుంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ద్వంద ప్రమాణాలు అందరికీ తెలుసున్నవే అని ముందు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు.. వారు వద్దంటే ఎదుటివారితో కలిపి విమర్శలు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో కూడా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని విమర్శలు చేసి ఇప్పుడు అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నారని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.