రాష్ట్రపతితో టిపై కిరణ్ అసహనం, జగన్పై ఆనం ఆగ్రహం
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడాన్ని రాజకీయం చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం కిరణ్ రాష్ట్రపతితో దాదాపు గంటపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు విషయం వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
దీనిపై కిరణ్ సోమవారం అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని కలవడాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. తాను మర్యాదపూర్వకంగానే ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నానని తెలిపారు. తమ భేటీలో తెలంగాణ ముసాయిదా బిల్లు అంశంపై చర్చ జరగలేదని, దాని గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకు రాలేదన్నారు.

కాంగ్రెసు అనాలోచిత నిర్ణయం: ఆనం
కాంగ్రెసు పార్టీ అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆనం సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ బిల్లు అసెంబ్లీలో అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యులు అందరూ కలిసి రావాలని కోరారు. సమైక్యం ముసుగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విభజన కోరుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications