ఇప్పుడు సోనియాకు ప్రేమ, కాంగ్రెస్ నుండే వచ్చా: బాబుపై తోట ప్రశంస
న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లును తాను సమర్థిస్తున్నానని టీడీపీ లోకసభా పక్ష నేత తోట నర్సింహం అన్నారు. ఈ బిల్లుతో ఏపీలో శాసన మండలి సభ్యులను పెంచుకునే అవకాశముందన్నారు. తెలంగాణ ప్రజల ఆశల మేరకు నాడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ... నేడు మాత్రం ఏపీ పైన ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతన్నారని ఎద్దేవా చేశారు. వీరప్ప మొయిలీ కూడా కపట ప్రేమను ఒలకబోశారన్నారు.
తాను కూడా కాంగ్రెస్ పార్టీ నేతనేని, కానీ ఏపీకి కాంగ్రెస్ పార్టీ మోసం చేయడంతో తాను చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు. ఏపీకి అన్యాయం చేస్తూ రాష్ట్ర విభజన చేశారన్నారు. ఈ రోజు ఏపీ పైన ప్రేమ చూపుతున్న సోనియా.. నాడు ఒక్క క్షణం ఏపీ గురించి ఆలోచించినా బాగుండేదన్నారు. దౌర్జన్యంగా బిల్లు పాస్ చేశారన్నారు. నాడు ఏపీలో ధర్నాలు చేసినా పట్టించుకోలేదన్నారు.
శాస్త్రీయత లేకుండా విభజన చేశారన్నారు. వాటాలు కూడా సరిగా పంచలేదన్నారు. లాభనష్టాలను పద్ధతి లేకుండా పంచాయన్నారు. విభజన సమయంలో ఒక్క క్షణం ఏపీ గురించి ఆలోచించినా న్యాయం జరిగేదన్నారు. కష్టాల్లో ఉన్న ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నిత్యం శ్రమిస్తున్నారన్నారు. అందుకోసం ఆయన దేశ, విదేశాలు తిరుగుతున్నారన్నారు. వీరప్ప మొయిలీ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వాకంతో ఏపీ ప్రజలు బాధలు పడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు మండలాలను ఏపీలో కలపడం ఎన్డీయే ప్రభుత్వం చేసిన ఘనత అన్నారు. త్వరలో పోలవరంకు నిధులు కూడా సమకూరుతాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ఏపీ పైన ప్రేమ ఉన్నట్లు సోనియా మాట్లాడటం అభినందనీయమన్నారు. తెలంగాణ, ఏపీ అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. దీనికి కేంద్రం సహకరించాలన్నారు.