ఔటర్లో కారు తుక్కు: ముగ్గురు దుర్మరణం (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లోని సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ సూర్యనారాయణ కుటుంబసభ్యులతో గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు.
ఆయన భార్య నాగరామలక్ష్మి (53) నాలుగు రోజుల క్రితం విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. రాజమండ్రిలో ఎంబీబీఎస్ చదువుతున్న కూతురు సింధూర (19)ను దసరా పండగకు హైదరాబాద్ తీసుకురావాలనుకుంది. తల్లీకూతుళ్లతో పాటు నాగరామలక్ష్మి సోదరుడు మహీధర్ (50), అతడి కుమార్తె అపర్ణ (20) సోమవారం కారులో హైదరాబాద్ బయలుదేరారు.
మార్గమధ్యంలో శంషాబాద్ మండల పరిధిలోని కిషన్గూడ జంక్షన్ వద్ద ఆగి ఉన్న కర్నాటక రాష్ట్రానికి చెందిన లారీని కారు ఢీకొంది. సగ భాగం లారీ కిందకి దూసుకుపోవడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న మహీధర్, నాగరామలక్ష్మి, సింధూరకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ అపర్ణను శంషాబాద్లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు.

ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో సోమవారం జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

క్రేన్తో బయటకు తీశారు
లారీ కింద ఇరుక్కున కారును భారీ క్రేన్ సహాయంతో బయటకు తీశారు. కారులో నుంచి శవాలను బయటకు తీయడానికి పోలీసులు రెండు గంటలు శ్రమించారు.

సమాచారం ఇలా..
ప్రమాదంలో గాయపడిన అపర్ణ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కుటుంబసభ్యులకు ప్రమాదం గురించి తెలియజేశారు.

కుప్పకూలిన కుటుంబ సభ్యులు
నాగరామలక్ష్మి భర్త సూర్యనారాయణ, కుమారుడు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను చూసి ప్రమాద స్ధలంలో కుప్పకూలిపోయారు. పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం చేయించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

లారీ వల్లనే ప్రమాదం..
ఔటర్ రింగ్రోడ్డులో లారీ ఆదివారం రాత్రి ఔటర్పై నిలిచిపోయిందని, దానిని అక్కడి నుంచి తరలించడం గానీ, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం గానీ చేస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications