దగ్ధమైన బోగీ: శేషాచలం ఎన్కౌంటర్కు ప్రతీకారమా?
నెల్లూరు: ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్కు ప్రతీకారంగానే గుర్తు తెలియని వ్యక్తులు చెన్నై-గూడురు ప్యాసింజర్ రైలు బోగీకి నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం సాయంత్రం 14 బోగీలతో గూడురుకు బయలుదేరిన రైలులోని ఓ బోగీకి మంటలు అంటుకున్నాయి.
ఈ బోగీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సోమవారం రాత్రి దగ్ధమైంది. ఈ ప్యాసింజర్ రైలు బోగీని మంగళవారం నాడు చెన్నైకి చెందిన దక్షిణ రైల్వే అధికారుల బృందం పరిశీలించింది. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దక్షిణ రైల్వే డీఆర్ఎం అనురాగ్ శర్మ ఘటన ప్రాంతానికి వచ్చి వెళ్లారు.
తమిళనాడు సరిహద్దుల్లో బోగీలో పొగలు, మంటలు వచ్చనా ఐదు రైల్వే గేట్లను దాటి రైలు సూళ్లూరుపేటకు చేరింది. పొగలు వస్తున్నా గేట్ మ్యాన్లు ఉన్నతాధికారులకు తెలియజేయకపోవడంపై రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అరంబాకం నుండి సూళ్లూరుపేట వరకు ఉన్న ఐదు గేట్ల మ్యాన్లను విచారించనున్నారు.