మేజిక్ మార్క్పై కెసిఆర్ మంతనాలు, టిటిడిపికి గాలం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం నేడు (శుక్రవారం) భేటీ కానుంది. పార్టీ అభ్యర్థులతోను కెసిఆర్ భేటీ కానున్నారు. తెరాస ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది, సీట్లు తక్కువ పడితే ఎలా అనే తదితర అంశాల పైన ఆయన చర్చించనున్నారు. నాలుగైదు స్థానాల్లో తగ్గితే... అనే కోణంలో ఆలోచించి ఇండిపెండెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇప్పటికే పలువురితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అలాగే టిడిపి గెలుపు గుర్రాలకు గాలం వేసే విషయమై ఆలోచిస్తున్నారట.
మెజార్టీ స్థానాలు దక్కించుకొని తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్న పలువురు తెరాస ముఖ్యుల్లో మరో కోణంలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో ఏ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా 60 స్థానాల మేజిక్ ఫిగర్ను సాధించాల్సిందే. పోలింగ్ సరళిని బట్టి తమకు 62 నుండి 75 స్థానాలు వస్తాయని తెరాస భావిస్తోంది.
ఊహించని పరిస్థితుల్లో మేజిక్ ఫిగర్ 60 కంటే నాలుగైదు స్థానాలు తగ్గితే ఎలా ? అనే సందేహం కూడా పార్టీ వర్గాల చర్చలో ప్రస్తావనకు వస్తోంది. ఈక్రమంలో సొంతంగా సంపూర్ణ మెజార్టీ సాధిస్తే తప్ప, ఇతర పార్టీల మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులువు కాదని, ఒకవేళ అలా ఏర్పాటు చేసినప్పటికీ, పార్టీ ఆశించిన రీతిలో తెలంగాణ పునర్నిర్మాణం చేపట్టలేదని, నిర్ణయాలు తీసుకోలేదని తెరాస కీలక నేతలు పలువురు భావిస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ మెజార్టీ రావాలని, అలా కాకుండా మేజిక్ ఫిగర్కు నాలుగైదు స్థానాలు తగ్గితే కష్టమేనని వారు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. దీంతో తెరాస కాంగ్రెస్, టిడిపిలోని గెలుపు గుర్రాలపై కన్నేసిందని అంటున్నారు. రెండు, మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందనే అంచనాల మేరకు వారితోనూ సంప్రదింపులు జరపుతున్నారట.
ఎన్నికలకు ముందు సిపిఐ, మజ్లిస్తో కలిసి పోటీ చేయాలని తెరాస భావించింది. చివరికి ఒంటరిగానే బరిలోకి దిగాల్సి వచ్చింది. ఒక దశలో తెరాస తరఫున కాంగ్రెస్తో పొత్తుకు సిపిఐ రాయబారం కూడా నడిపినా ఫలించలేదు. ఈ క్రమంలో ఫలితాల తర్వాత తమకు తగిన మెజార్టీ రాకపోతే, మజ్లిస్ మద్దతు కోసం తెరాస ప్రయత్నాలు చేస్తోందట. మజ్లిస్ కోసం కాంగ్రెసు పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారు ఎవరు వైపు మొగ్గు చూపుతారని ఆసక్తికరంగా మారింది.
టిడిపిని బద్ధ శత్రువుగా భావించటం, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని సన్నాసి అని కెసిఆర్ తూలనాడడం వల్ల కమలనాథులు తెరాసకు మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తొలి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఇప్పటికే మిత్రుల వేటలో పడ్డ కాంగ్రెస్, అధికారానికి దూరమై, తెరాసకు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. సిపిఎం ఒకవేళ ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాలు గెలిస్తే, ఆ పార్టీ కాంగ్రెస్-బిజెపియేతర ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వాలనే కోణంలో తెరాసకు మద్దతివ్వవచ్చునంటున్నారు.












Click it and Unblock the Notifications