విజయవాడ వెళ్లే ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్..!!
ఏపీలో ఓట్ల పండుగ జరుగుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఏపీకి తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ నుంచి వస్తున్న బస్సులు, రైళ్లు, ప్రయివేటు సర్వీసులు ఫుల్ అయిపోయాయి. చాలా మంది సొంత వాహనాల్లో గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఇంకా అనేక మంది చివరి నిమిషంలో ఏపీకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి కోసం ఆర్టీసి కీలక ప్రకట చేసింది.
ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్-విజయవాడ రూట్ లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టినట్లు యాజమాన్యం ప్రకటించింది. బస్సుల్లో దాదాపు ౩ వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరింది.

టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం tsrtconline.in వెబ్ సైట్ లో సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. అలాగే, హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్ని బస్సులు నిండుకున్నాయి. రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. వరస సెలవులు, ఎన్నికలు కావటంతో అంచనాలకు మంచిన రద్దీని తట్టుకొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications