TTD: టీటీడీలో కీలక నియామకాలు, ఏరి కోరి- వారి మార్గదర్శకంలోనే ఇక..!!
Tirumala: టీటీడీలో కీలక నియామకాలు జరిగాయి. తాజాగా జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలోనూ పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణం గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో సిఫారసు లేఖలను తిరిగి స్వీకరిస్తున్నారు. తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడాలని నిర్ణయం. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆధికారులను పాలక మండలి తాజా గా ఆదేశించింది.
ఆగమ సలహా కమిటీ
టీటీడీ గత మార్చి నెలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దుచేసి, కొత్త కమిటీని నియమించింది. ఐదుగు రు సభ్యులతో కూడిన కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేసారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఎ.ఎస్.శ్రీ కృష్ణ శేషాచలం దీక్షితులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని వైఖానస ఆగమ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పరాశరం భవనారాయణాచార్యులు, చెన్నైకు చెందిన పీ.కే.వరదన్ భట్టాచార్యార్, శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయంలోని సంభావన అర్చకులు ఏ.అనంత శయన దీక్షితులు, మాజీ అర్చకులు ఏ.ఖద్రీ నరసింహాచార్యులను నూతన ఆగమ సలహా కమిటీలో సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరి పదవీ కాలం రెండేళ్ల పాటు కొనసాగనుంది.

నూతన సీవీఎస్వోగా
టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో)గా కేవీ మురళీకృష్ణను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నంలోని 16వ బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్న మురళీకృష్ణ ఇకపై టీటీడీ సీవీఎస్వోగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. గతంలో తిరుపతి, తిరుమలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. తిరుమల శ్రీవారి సేవకు అవకాశం రావడం సంతోషంగా ఉందని.. భక్తుల, టీటీడీ భద్రతకు చర్యలు తీసుకుంటానని మురళీ కృష్ణ చెప్పుకొచ్చారు. ఇక.. తాజాగా జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలోనూ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసారు. తిరుమలలోని విశ్రాంత భవనాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్దరు దాతలు స్పందించలేదు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలని నిర్ణయించారు.
కొత్త ప్రణాళికలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణయించే అంశంపై ఆమోదం. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, పర్యావరణ, మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications