పాలేరుపై తుమ్మలVsనామా: బాబు హెచ్చరిక, ట్విస్ట్
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో పార్టీ అగ్రనేతల మధ్య నెలకొన్న గ్రూపు తగాదల పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ఇరువురు నేతలతో సోమవారం చంద్రబాబు ఫోనులో మాట్లాడారట. ఖమ్మం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తుమ్మల.. ఈసారి పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఖమ్మంలో మైనార్టీ ఓటర్లు గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో, బిజెపితో పొత్తు వల్ల పాలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల భావిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి తుమ్మల బరిలోకి దిగడాన్ని ఖమ్మం ఎంపి నామా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పాలేరు స్థానాన్ని తన అనుచరురాలైన స్వర్ణ కుమారికి ఇవ్వాలని నామా పట్టుబడుతున్నారు. స్వర్ణ కుమారికి కాకుండా పాలేరు స్థానాన్ని తుమ్మలకు ఇస్తే ఎంపి స్థానానికి తాను పోటీ చేయనని నామా భీష్మించుకున్నారు. వీరిద్దరి గ్రూపు రాజకీయాలపై అసంతృప్తితో ఉన్న బాబు ఇద్దరికీ షాక్ ఇచ్చే ప్రతిపాదనను తాజాగా తెరపైకి తీసుకు వచ్చారట.
ఇద్దరు ప్రతిష్టకు పోతే ఒకరి స్థానం మరొకరికి ఇస్తానని హెచ్చరించారని సమాచారం. ఖమ్మం లోసభ స్థానం నుంచి తుమ్మల, ఖమ్మం లేక పాలేరు నుంచి కానీ అసెంబ్లీకి నామా పోటీ చేస్తే సరిపోతుందని చంద్రబాబు చెప్పారట. అయితే, నామా, తుమ్మలలు మాత్రం పట్టువీడటం లేదు.