మాయలేడీ పావని కేసులో ట్విస్ట్: చింటూకు ఇచ్చిన రూ. 50 లక్షలు సీజ్
చిత్తూరు: జిల్లాలో పలువురు మహిళలను మోసం చేసి బంగారు ఆభరణాలు కాజేసీిన పావని కేసు కొత్త మలుపు తిరిగింది. చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూకు పావని ఇచ్చినట్లు గుర్తించిన రూ. 50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముత్తూట్ ఫైనాన్స్ నుంచి 460 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎస్పీ శ్రీనివాస్, కేసు దర్యాప్తు అధికారి గిరిధర్ శుక్రవారం మీడియాకు వివరించారు.
చిత్తూరుకు చెందన ఆటో డ్రైవర్ చరణ్ భార్య పావని 2103 నుంచి 2015 వరకు మాయమాటలు చెప్పి పలువురు మహిళల నుంచి దాదాపు 8 కిలోల బంగారు ఆభరణాలు తీసుకుంది. వీటిని ఆమె చిత్తూరులోని ముత్తూట్ ఫైనాన్స్లో 244 ఖాతాల్లో కుదువ పెట్టి రూ.1.52 కోట్ల అప్పు తీసుకుంది. ఆభరణాలు వెనక్కి ఇవ్వాలని మహిళలు అడగడంతో పావని హరిదాస్ ద్వారా చింటూను ఆశ్రయించింది.
చింటూ తనను బెదిరించాడంటూ జోత్స్న అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో పావని విషయాలు వెలుగు చూశాయి. ఒత్తిళ్ల నుంచి తప్పించినందుకు చింటూకు పావని రూ.50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందులో రూ.45 లక్షలు బెంగళూరులో చింటూకు పరిచయం ఉన్న వ్యక్తి వద్ద, మిగిలిన రూ.5 లక్షలు గంగనపల్లెలోని చింటూ నివాసంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని, మరిన్ని వివరాలు రాబడుతామని ఎస్పీ చెప్పారు.
కాగా, పావని పరారీలో ఉంది. ఆమె కోసం, ఆమె భర్త చరణ్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. త్వరలోనే వారిని ఆరెస్టు చేస్తామని అన్నారు.