అన్నవరం కొండపై పేలిన సిలిండర్లు: ఇద్దరికి తీవ్ర గాయాలు
తూర్పుగోదావరి: జిల్లాలోని అన్నవరం కొండపై భారీ పేలుడు సంభవించింది. కొండపైన వంటశాలలో రెండు సిలిండర్లు పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కాకినాడలోని ఆస్పత్రికి తరలించారు.
మరో ఇద్దరికి ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి. సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. వంటశాలలోని సిబ్బంది బయటికి పరుగులు తీశారు. వంటశాలలో భారీగా గోధుమ, పంచధార నిల్వలు ఉన్నాయి.
కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.
బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం
చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలం పుల్లూరుక్రాస్ రోడ్డులోని ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.
విద్యుత్షాక్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో షాపు పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ. లక్ష ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
కాంట్రాక్టర్ ఇంట్లో భారీ చోరీ
విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 30 తులాల బంగారం, ఐదు కేజీల వెండి, రూ.50 వేల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.