మహానాడుకి వెళ్తుండగా ప్రమాదం:ఇద్దరు మున్సిపల్ చైర్మన్లకు గాయాలు
గుంటూరు:టిడిపి మహానాడుకి వెళ్తండగా కార్లు ప్రమాదానికి గురవడంతో ఇద్దరు మున్సిపల్ ఛైర్మన్లు గాయపడ్డారు. విజయవాడలో జరుగుతున్న టిడిపి మహానాడుకు హాజరయ్యేందుకు బయలుదేరి వెళుతున్న బాపట్ల మున్సిపల్ చైర్పర్సన్ తాడేపల్లి సమీపంలో అదుపుతప్పి మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కారును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బాపట్ల చైర్పర్సన్ తోట మహాలక్ష్మి, ఆమె భర్త నారాయణతో పాటు ఎదురు కారులో ఉన్న మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కె.శివప్రసాద్ కూడా గాయపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో బైపాస్ రోడ్డుపై ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే...
బాపట్ల చైర్పర్సన్ తోట మహాలక్ష్మి తన భర్త నారాయణ, మరో వ్యక్తితో కలసి విజయవాడలో జరిగే టిడిపి మహానాడుకు వెళ్తుండగా సంఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ముందు టైరు పేలింది. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కె.శివప్రసాద్ కారును బలంగా ఢీ కొట్టింది.
మరోవైపు ఇదే మహానాడు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ కారు ప్రమాదానికి గురైంది. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఆమె తన కారులో వస్తుండగా స్థానిక బెంజి సర్కిల్ దగ్గర ఎమ్మెల్యే కారు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదంలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే సమీప ఆసుపత్రికి ఆమెను తరలించి వైద్య చికిత్స అందించారు. ప్రమాదంలో గాయపడ్డ సుగుణమ్మను పలువురు నేతలు పరామర్శించారు.