బెజవాడ జగన్ పార్టీలో చిచ్చు, పేపర్స్ విసిరిన వంగవీటి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 'స్థానిక' చిచ్చు రాజుకుంది. పార్టీ అభ్యర్థుల విషయంలో సీనియర్ నేతలు వంగవీటి రాధాకృష్ణ, గౌతమ్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్టీ పరిశీలకులుగా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రావు వచ్చారు.
పార్టీ అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల పైన వారు చర్చిస్తున్నారు. 21వ డివిజన్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు తన వర్గానికి చెందిన వారిని అభ్యర్థిగా నిలబెట్టాలని వంగవీటి రాధా డిమాండ్ చేశారు. గౌతమ్ రెడ్డి వర్గం అభ్యర్థికి ఆయన ససేమీరా అన్నారు. ఓ దశలో తన చేతిలో ఉన్న బిఫారాలను వంగవీటి రాధా ఉమ్మారెడ్డి ముందుకు విసిరేశారు.
కాగా, మునిసిపల్ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్కు చేరుకుంది. మొదటి రెండు రోజులలో అంతంత మాత్రంగా ఉన్న నామినేషన్ల సందడి బుధ, గురువారాల నాటికి ఊపందుకుంది. విజయవాడ నగర పాలక సంస్థకు గురువారం, జిల్లాలోని ఎనిమిది మునిసిపాలిటీలకు శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. బుధవారం మంచిరోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి.
మొదటి రెండు రోజులలో విజయవాడలో కేవలం 22 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా బుధవారం ఒక్కరోజే 279 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల తుది గడువు ముగుస్తుండటంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేశాయి. అన్ని పార్టీలు జాబితాను సిద్ధం చేశాయి.