తెగిస్తానని అద్వానీకి చెప్పా: వెంకయ్య, విభజనపై సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు: కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు మంగళవారం నాడు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన ద్వారా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేందుకు తాను ఎంత వరకైనా వెళ్తానని ఆనాడు బీజేపీ అధిష్టానానికి చెప్పానని అన్నారు.
ఆయనకు తెనాలిలో ఈ రోజు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజనతో ఏపీకి న్యాయం జరిగేలా ఉంటేనే బిల్లుకు మద్దతిస్తానని ఆనాడు తాను విభజన సమయంలో చెప్పానని అన్నారు. ఏపీకి న్యాయం జరిగేందుకు ఎంతవరకైనా వెళ్తానని చెప్పానని అన్నారు.
ఈ విషయాలను తాను ఆ సమయంలోనే తమ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానికి గట్టిగా చెప్పానని వెంకయ్య నాయుడు అన్నారు. కాగా, విభజన బిల్లు సమయంలో రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
తలుపులు మూసి 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు
సభలో విభజన సక్రమంగా జరగలేదన్నారు. లోకసభలో తలుపులు మూసి 23 నిమిషాల్లో బిల్లును పాస్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, బిల్లులో తాము అడిగినవి పెట్టలేదన్నారు. ఏపీకి న్యాయం జరగాలని మొదటి నుంచి పోరాడింది తానే అన్నారు. సభలో నోరు మెదపని వారు ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని నాడు డిమాండ్ చేసిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు అడగటం లేదని, హోదా విషయంలో రివర్స్ గేర్ ఏమిటని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వరద ప్రాంతాల్లో పర్యటించిన వెంకయ్య
ఏపీలో కురిసిన భారీ వర్షాల ధాటికి అక్కడి పలు జిల్లాలను వరద ముంచెత్తాయి. ఆయా ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు విహంగ వీక్షణం ద్వారా ఇప్పటికే పరిశీలించారు. తాజాగా, మంగళవారం నాడు వెంకయ్య నాయుడు గుంటూరులో వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్సర్వే చేశారు. జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నరసరావుపేట, ప్రత్తిపాడు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులతో చర్చించి వరద ద్వారా తలెత్తిన నష్టం వివరాలను తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులపై ఆరా తీశారు.