మోడీ మాయన్నారు, ఇప్పుడేం చెబుతారు: వీహెచ్ ఫైర్
హైదరాబాద్: పెట్రోలు ధరలు తగ్గినప్పుడు ‘ప్రధాని నరేంద్ర మోడీ మాయ' అన్న భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు పెరిగిన ధరలకు ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు వి హనుమంతరావు ప్రశ్నించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో రైతు భరోసా యాత్ర చేశారని చెప్పారు. రాహుల్ యాత్ర రాజకీయ లబ్ధి కోసమే అయితే హైదరాబాద్ నుంచే వెళ్లేవారని అన్నారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే అంశంపై పార్టీలో చర్చిస్తామని అన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపి మధుయాష్కీ నిజామాబాద్లో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కమిషన్కాకతీయగా మారిందని ఆరోపించారు. 5 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారన్నారు.
పెట్రోల్ ధరల పెంపును తీవ్రంగా ఖండిస్తున్నాం: వాసిరెడ్డి
పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. రూపాయల్లో పెంచి పైసల్లో తగ్గించారని అన్నారు. సామాన్యుడి నడ్డివిరిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలున్నాయని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వాల విధించిన వ్యాట్ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సిపిఐ నిరసన
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. శనివారం హిమాయత్నగర్లో సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో సీపీఐ ధర్నా చేపట్టింది. నిరసనలో భాగంగా ప్రధాని దిష్టి బొమ్మను సీపీఐ నేతలు దగ్ధం చేశారు.
పెట్రోల్ ధరలను కేంద్రం ఇష్టానుసారంగా పెంచుతోందని ఈ సందర్భంగా చాడా వెంకట్రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్ ధరల పెంపుపై ప్రధాని మోడీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. చమురు కంపెనీల చేతిలో మోడీ కీలు బొమ్మ అని వ్యాఖ్యానించారు.
మోడీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైనదే తప్ప పేద ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై వ్యాట్ను తగ్గించాలని చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగినప్పుడల్లా కేంద్రం పెట్రోల్, డీజిల్ దరలను పెంచుతోందని, దీని వల్ల సగటు జీవిపై పెను భారం పడుతుందని సీపీఐ నేతలు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications