నేను వెళ్ల: జగన్పై విహెచ్ జోస్యం, పెదవి విరిచిన గండ్ర
వరంగల్/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తానంటే ఎవరు నమ్మరని, అవినీతిపరుడు అయిన జగన్ ఎప్పటికీ సిఎం కాలేడని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు శుక్రవారం మండిపడ్డారు. తాను సీమాంధ్రలో ప్రచారానికి వెళ్లనని చెప్పారు. అత్యంత అవినీతిపరుడైన జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం హాస్యాస్పదమన్నారు.
జగన్ ఎన్నటికీ సిఎం కాలేడన్నారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి అనుకూలంగా పని చేశారన్నారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని, తనపై తప్పుడు కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇష్టారీతిగా వ్యవహరించారన్నారు.
పెదవి విరిచిన గండ్ర
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము కొంతవరకు విఫలమయ్యామన్నారు. రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడమేనని దీనికి కారణమన్నారు.
ఏదేమైనప్పటికీ, అనుకున్నన్ని స్థానాలను సొంతం చేసుకోలేకపోయినా... అధికారంలోకి రావడం మాత్రం ఖాయమన్నారు. ప్రజలు కెసిఆర్ మేనిఫెస్టోను నమ్మారు తప్పితే కాంగ్రెసు మేనిఫెస్టోను నమ్మలేదన్నారు. స్టార్ కంపెయినర్లు లేరన్నారు. ఫలితాలకు రాష్ట్ర నాయకత్వమే బాధ్యత వహించాలన్నారు.