మిమ్మల్ని సీఎంగా చూడాలి, కానీ వెన్నుపోటుతో: జగన్కు విశాఖ నేత షాక్
విశాఖ: వెన్నుపోటు పొడిచిన వారిని అందలం ఎక్కించవద్దని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేత ప్రగడ నాగేశ్వర రావు ఝలక్ ఇచ్చారు. అలాంటివారిని అందలమెక్కిస్తే పార్టీ కోసం పని చేసే నిజమైన వారి మనోభావాలు దెబ్బతింటాయన్నారు.
విశాఖల జిల్లా యలమంజిలి నియోజకవర్గం నేత నాగేశ్వర రావు సోమవారం ఓ ఫంక్షన్ హాలులో నాలుగు మండలాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు.
నియోజకవర్గంలో పార్టీని అబాసుపాలు చేసే వారికి ప్రాధాన్యం ఇవ్వవద్దని, కార్యకర్తలను ఇది ఆవేదనకు గురి చేస్తోందన్నారు. గతంలో తన ఓటమికి కారణమైన వ్యక్తి, రానున్న రోజుల్లో పార్టీని అమ్ముకుంటాడని, అటుంటి పరిస్థితి ఏర్పడకుంటా మనమంతా పోరాడాలని పిలుపునిచ్చారు.
తాను తప్పు చేశానని సదరు వ్యక్తి ప్రచారం చేస్తున్నారని, ఎవరు తప్పు చేశారో ప్రజల మధ్యకు వెళ్లి తేల్చుకుందామన్నారు. జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆశయమన్నారు. ఇందుకు అధిష్టానం మాటే తనకు శిరోధార్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో యలమంచిలి టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ఓ కార్యకర్తగా వైసిపి అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు.