బాబు ప్లాన్: ఆర్థిక రాజధానిగా విశాఖ, సినిమా ఇండస్ట్రీ..
హైదరాబాద్: విశాకను ఆర్ధిక రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోందట. రాజధానిని విజయవాడ - గుంటూరు మధ్య ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో విశాఖను ముంబై తరహాలో ఆర్ధిక రాజధానిగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. విశాఖ రాజధానిగా కాకపోయినా ఆర్థిక రాజధానిగా చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో... మహానగరానికి ఉండాల్సిన వసతుల కల్పన, సౌకర్యాల వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి పెడుతోందట. ముందుగా ప్రస్తుత విమానాశ్రయాన్ని వేరేచోటుకు మారుస్తూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. దీని కోసం వివిధ ప్రాంతాలను అన్వేషించే పనిలో అధికార్లు నిమగ్నమయ్యారు. ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉండటంతో విస్తరించే అవకాశం లేదు. దీంతో కొత్త ప్రాంతంలో అంతర్జాతీయస్థాయి విమానశ్రయం నిర్మించాలని యోచిస్తున్నారు.
ఇప్పటికే జిల్లా కలెక్టర్ను నివేదికలు కోరారని సమాచారం. ఇదే సమయంలో విశాఖలో రవాణా వ్యవస్థ క్రమబద్ధీకరణకు మెట్రో రైలు నిర్మాణం పైనా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. కొద్దికాలం క్రితమే మెట్రో రైలు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విశాఖ జిల్లాలో సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటిఐఆర్)ను ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేస్తున్నారు.

విశాఖ కేంద్రంగా విశాఖ- కాకినాడ మధ్య పెట్రోలియం, కెమికల్స్, పెట్రోకెమికల్స్ పెట్టుబడుల ప్రాంతాన్ని త్వరగా పూర్తి చేసేందుకూ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. ఇక సినీ పరిశ్రమను విశాఖ జిల్లాలో ప్రధాన కేంద్రంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారట. నాటి మద్రాసు నుంచి హైదరాబాద్కు సినిమా పరిశ్రమ మొత్తం తరలివచ్చినట్టుగా కాకుండా దశల వారీగా విశాఖకు సినిమా పరిశ్రమను తరలించే ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది నిర్మాతలతో చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ వంటి నిర్మాతలు విశాఖలో పరిశ్రమను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చారట. సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సినీ పరిశ్రమకు తెలంగాణలోని నైజాంలోనూ మార్కెట్ మెరుగ్గా ఉండటంతో ఒకేసారి విశాఖకు చిత్ర పరిశ్రమను తరలించేందుకు ఇబ్బందులు ఉంటాయని, అందువల్ల దశలవారీగా పరిశ్రమను తరలించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఉన్న రవీంద్రభారతి, శిల్పారామం, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తరహాలో విశాఖలోనూ కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పిస్తోంది. వీటికోసం స్థలాలను అనే్వషించాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. విజయవాడ - గుంటూరు ప్రాంతంలోనూ మెట్రో రైలు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కొత్త రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో విశాఖపట్నాన్ని అన్ని విధాలా అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని గంటా చెబుతున్నారు. అసెంబ్లీ ఆవరణలో గంటా మీడియాతో మాట్లాడుతూ విశాఖతోపాటు, విజయవాడ - గంటూరు- మంగళగిరి - తెనాలి ప్రాంతాన్ని, రాయలసీమలోని పట్టణాలను వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications