కిరణ్పై వివేక్ ఫైర్: జైపాల్ ఇంట్లో టి కాంగ్రెస్ మంతనాలు
కరీంనగర్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సంపాదనే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ శుక్రవారం మండిపడ్డారు. ఆయన కరీంనగర్ జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రుల బృందానికి (జివోఎం)కు కిరణ్ తప్పుడు నివేదికలు ఇచ్చారని, ఆయనకు నైతిక విలువలు ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలన్నరు. ఇటీవల జరుగుతున్న ఫైళ్ల క్లియరెన్సు పైన విచారణ జరిపించాలన్నారు.
జైపాల్ నివాసంలో టి కాంగ్రెసు నేతల మంతనాలు
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. జివోఎంకు ఆంటోని కమిటీ పలు సిఫార్సులు చేసిందనే వార్తల నేపథ్యంలో వారు అందులో మార్పులు చేర్పులు కోరే అంశంపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఆంటోని కమిటీ నివేదిక పట్ల తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
జైపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్రమంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు సుదర్శన్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణ నేతలు జివోఎం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నివేదిక పైన అభ్యంతరం చెప్పేందుకు వారు ప్రధానమంత్రి అపాయింటుమెంట్ కోరారు.