అలర్ట్.. వందేభారత్ టైమింగ్స్ మార్పు!
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 30 మార్గాల్లో ఇవి పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే మరో 5 మార్గాల్లోకి అందుబాటులోకి రాబోతోంది. తాజాగా విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలుకు సంబంధించిన షెడ్యూల్ ను, స్టాప్స్ ను దక్షిణ మధ్య రైల్వే మార్పు చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ రైలుగా ప్రారంభమైన ఈ బండి కోసం కాకినాడ జిల్లా వాసుల నుంచి అభ్యర్థనలు పోటెత్తాయి. దీంతో కాకినాడకు సమీపంలోని సామర్లకోట జంక్షన్ లో వందే భారత్ ను నిలపాలని అధికారులు నిర్ణయించారు. ఇకనుంచి దీనికి ఐదు స్టాపులవుతాయి. 20833/20834 విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం రైలు గతంలో నాలుగు స్టేషన్లలో ఆగేది. ఇకనుంచి ఐదు స్టేషన్లలో ఆగబోతోంది. సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో దీనికి హాల్ట్ సౌకర్యం కల్పించారు.

సామర్లకోట్ లో స్టాపేజ్ ఉండటంతో టైమింగ్స్ మార్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. నెం. 20833 (విశాఖపట్నం-సికింద్రాబాద్) వందే భారత్ ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి 7.14 గంటలకు సామర్లకోట చేరుకుంటుంది. అక్కడి నుంచి 7.15 గంటలకు బయలుదేరుతుంది. రాజమండ్రి 7.55 గంటలకు, విజయవాడ 9.50 గంటలకు, ఖమ్మం 11.00 గంటలకు, వరంగల్ 12.05 గంటలకు చేరుకుంటుంది. అన్ని స్టేషన్లలో ఒక్క నిముషం మాత్రమే ఆగుతుంది. విజయవాడలో మాత్రం 5 నిముషాలు ఆగుతుంది.
నెం. 20834 సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి వరంగల్ కు 4.35, ఖమ్మం 5.45 గంటలకు, విజయవాడకు సాయంత్రం 7.00 గంటలకు, రాజమండ్రికి 8.58 గంటలకు, సామర్లకోట 9.34 గంటలకు చేరుకుంటుంది. ఆయా స్టేషన్లలో ఒక్క నిముషం ఆగుతుంది. విజయవాడలో 5 నిముషాలు ఆగుతుంది.












Click it and Unblock the Notifications