లారీని ఢీ కొట్టిన వోల్వో బస్సు: 5గురికి తీవ్ర గాయాలు
ఒంగోలు: ప్రకాశం జిల్లా వెంగముక్క పాలెంక కూడలి సమీపంలో లారీని వేగంగా వస్తున్న వోల్వో బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
ఇటీవలే వెంగముక్క పాలెం కూడలి వద్ద కొత్తగా స్పీడ్ బ్రేకర్స్ను ఏర్పాటు చేశారు. వాటిని గమనించి లారీ డ్రైవర్ లారీ వేగాన్ని తగ్గించాడు. అదే సమయంలో వెనుకవైపు నుంచి వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు ప్రవేశ ద్వారం సహా ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే స్ధానిక ఇన్స్పెక్టర్ ఎస్. ఆంటోని రాజ్ హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
బస్సులో చిక్కకున్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు రక్షించారు. క్షతగాత్రులను హైవే పెట్రోలింగ్, 108 వాహనాల్లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణీకులు ఉన్నారు.