పీటల మీద పెళ్లి ఆగొచ్చు, పట్టించుకోం: టిపై అశోక్బాబు
హైదరాబాద్: పీటల మీదకు వచ్చాక కూడా పెళ్లి ఆగిపోయే పరిస్థితి లేకపోలేదని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మంగళవారం అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం రాజకీయ కార్యదర్శి శివశంకర్తో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు సభ్యులు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, వారు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రాజీనామా చేసి ఉంటే కేబినెట్ నోట్ వచ్చేది కాదన్నారు.
సమ్మె విరమించాలనే మంత్రులు, పార్లమెంటు సభ్యుల మాటలకు తాము స్పందించేది లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరిదాకా ప్రయత్నాలు చేస్తామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తాము హైదరాబాదు, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను కలుస్తామని, అలాగే జాతీయ పార్టీ నేతలను కూడా కలుస్తామన్నారు. ఈ రోజు నుంచి ఉద్యోగులు మళ్లీ సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పారు.

రేపు ఉద్యోగ సంఘాలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమైక్యం కోసం చివరి దాకా పోరాడాలన్నదే తమ నిర్ణయమన్నారు. సమ్మెను కొనసాగిస్తూనే రెవెన్యూ ఉద్యోగులు తుఫాన్ సహాయక చర్యలలో పాల్గొన్నారని చెప్పారు. ఉపాధ్యాయులు, ఆర్టీసి ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె నుండి తప్పుకున్నారని చెప్పారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరుపుతామని చెప్పారు.
17న ఉదయం తొమ్మిది గంటలకు ఐకాస నేతలతో భేటీ అయి ముఖ్యమంత్రితో మాట్లాడార్సిన విషయాలపై చర్చిస్తామని, మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రితో భేటీ అవుతామన్నారు. ముఖ్యమంత్రి హామీని బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పారు. విభజనకు నిరసనగా చివరి దాకా పోరాడం చేస్తామన్నారు. తెలంగాణపై ముందుకెళ్తే తాము సమ్మెను ఉధృతం చేస్తామన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పార్టీ విభజన చేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై తాము ఈ భేటీలో చర్చించలేదని, అందుకు ఇది వేదిక కాదన్నారు. పీటల మీదకు వచ్చాక పెళ్లి ఆగిపోయే పరిస్థితి లేకపోలేదని విభజనపై స్పందిస్తూ అన్నారు. తమ డిమాండ్ల పైన రెండు మూడు రోజుల్లో ప్రధాన కార్యదర్శికి నివేదిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications