బిజెపి: బాబుపై డిగ్గీ ఆగ్రహం, చిరు ఫ్యాన్స్పై రఘువీరా
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రయత్నాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం స్పందించారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన డిగ్గీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపితో పొత్తుతో చంద్రబాబు లౌకికవాదానికి తిలోదకాలు ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తొలత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, తర్వాత విభజనను వ్యతిరేకమని మాట్లాడి ఇరు ప్రాంతాల్లో బాబు రాజకీయ లబ్దిపొందాలని యత్నించారని ఆరోపించారు.
చిరు అభిమానులకు సీట్లు: రఘువీరా
తమ పార్టీలో నుండి పలువురు నేతలు వెళ్లినప్పటికీ కార్యకర్తలు తమతోనే ఉన్నారని సీమాంధ్ర పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి చెప్పారు. తమ పార్టీలో నీతి, నిజాయితీ ఉన్న వారు మిగిలారన్నారు. ధనబలం, కలవారు లేకపోయినా ప్రజాబలం ఉన్న పేదలను బరిలో దింపుతానమన్నారు. చిరంజీవి అభిమానులకు సీట్లు ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సిపిఐతో పొత్తు అంశం తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్న బిజెపితో చంద్రబాబు ఎలా పొత్తుకు సిద్ధమవుతారన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2019లోను టిక్కెట్లు ఇస్తామన్నారు. యువత, విద్యావంతులకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలను మోసం చేసేందుకే బిజెపి, టిడిపిలు పొత్తు పెట్టుకుంటున్నాయన్నారు.