అందుకే బాబును మోదీ దూరం పెట్టారా? జగన్పై నియంత్రణ కోసమేనా ఆగమేఘాలపై ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రారంభం?
న్యూఢిల్లీ/ అమరావతి: కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) నుంచి రేపోమాపో తెలుగుదేశం పార్టీకి ఉద్వాసన పలుకడం తప్పదేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం, ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును దూరంగా ఉంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రమాణ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి ఆహ్వానం పంపకపోవడమే కారణమిదేనని తెలిసింది. విజయ్ రూపానీ సారథ్యంలోని గుజరాత్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలంతా హాజరయ్యారు.
Recommended Video

గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర రాష్ట్రాల్లో ఎన్డీయే పాలిత సీఎంలు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యేవారు. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎన్డీయే మిత్రపక్షాల తరఫున ప్రచారం కూడా చేసి వచ్చేవారు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గిన నేపథ్యంలో చంద్రబాబును బీజేపీ దూరం చేసుకుంటుందా? అన్నది మున్ముందు వేచి చూడాల్సిందే.

బాబు మద్దతు గల టీవీ చానెల్.. గుజరాత్లో ఇలా వ్యతిరేక ప్రచారం
కానీ ఈ దఫా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసే విషయమై మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. అహ్మదాబాద్ నగరంలో జరిగిన విజయ్ రూపానీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు దూరంగా ఉన్నారు. మిగతా బీజేపీ పాలిత, మిత్రపక్షాల సీఎంలు అంతా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబును బీజేపీ నాయకత్వం ఎందుకు దూరంగా పెడుతున్నదన్నది రాజకీయ విశ్లేషకులకు అంతుబట్టకుండా ఉన్నది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రధాని మోదీ అప్ సెట్ కావడానికి ఒక అంశం కీలకమని చెప్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న టీవీ చానెల్ అనుబంధ వార్తా చానెల్ గుజరాతీలో వార్తలు ప్రసారం చేస్తోంది. ఈ చానెల్ గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకమైన వ్యూహాన్ని అమలు చేసిందని, అందువల్లే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఓటమి పాలైందని ప్రధాని మోదీ నిర్ధారణకు వచ్చారని సమాచారం.

ఏపీలో సీఎం బాబుపై బీజేపీ నేతల విమర్శల వేడి
సదరు గుజరాతీ - హైదరాబాద్ టీవీ చానెల్ ప్రచారం గురించి.. దాని వెనుక ఉన్నదీ ఏపీ సీఎం చంద్రబాబేనని ప్రధాని మోదీకి నిఘా వర్గాలు ఉప్పందించాయని వినికిడి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందొద్దని ఏపీ సీఎం చంద్రబాబు భావించారని, అది జరిగితేనే ఎన్డీయేలో టీడీపీ ప్రాముఖ్యత పెరుగుతుందని ఆయన అంచనా వేశారని సమాచారం. ఈ సంగతి తెలుసుకున్న ప్రధాని మోదీ.. చంద్రబాబు వ్యూహాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని తెలిసింది. అందువల్లే ఆయనతోపాటు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా చంద్రబాబును దూరం పెడుతున్నారని సమాచారం. మరోవైపు ఏపీలోని బీజేపీ నేతలు రోజుకొకరు విమర్శల వేడి పెంచుతుండటం గమనార్హం.

జగన్మోహన రెడ్డి ప్రచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యమా?
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లభిస్తున్న ఆదరణ, ప్రచారాన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సారథ్యంలో ప్రతిష్ఠాత్మక ‘ఏపీ ఫైబర్ గ్రిడ్' ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 149 చెల్లిస్తే 15 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతోపాటు ఉచిత టెలిఫోన్ వసతి, 250కి పైగా టీవీ చానెళ్లను వీక్షించొచ్చు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోని ప్రజలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది. కానీ ఆగమేఘాల మీద ‘ఈ ప్రాజెక్టు' ప్రారంభించడంలో ఎజెండా దాగి ఉన్నదన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

జగన్ కార్యక్రమాలపై సెన్సార్ షిప్ ప్రసక్తే లేదన్న అధికార వర్గాలు
ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన రెడ్డి సారథ్యంలోని టీవీ చానెల్, కేబుల్ నెట్ వర్క్ ఇప్పుడు ‘ఏపీ ఫైబర్ గ్రిడ్' పరిధిలోకి రావాల్సిందే. అదే జరిగితే ప్రతిపక్షం వాణి అణచివేతకు గల ప్రతి అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందన్న అభిప్రాయం ఉంది. పూర్తిస్థాయిలో ఏపీ ఫైబర్ గ్రిడ్ అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ వాసులు కేవలం ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వ పథకాలను మాత్రమే టీవీ చానెళ్లు ప్రచారం చేస్తాయని ఓ రాజకీయ నాయకుడు తెలిపారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రభుత్వ నియంత్రణలో ఉంటున్నందున ప్రతిపక్ష వాణి, ప్రజల సమస్యలను విపక్ష నేత జగన్ వినడానికి అవకాశం ఉండదని ఆ నేత చెప్పారు. ఇక నుంచి ఆయన కార్యక్రమాలపై సెన్సార్ విధించే అవకాశాలే ఎక్కువ అన్నారు. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం అదేమీ లేదని చెప్తున్నాయి. ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కార్యక్రమాలను నియంత్రించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రారంభించలేదని, జగన్ కార్యక్రమాలపై సెన్సార్ సిప్ ఉండదని అదికార వర్గాల కథనం.












Click it and Unblock the Notifications