కెసిఆర్ వ్యూహం: తెరాసకు మజ్లీస్ మద్దతు ఎందుకు?
హైదరాబాద్: అనూహ్యమేమీ కాకపోయినా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మజ్లీస్ మద్దతు కోరడం, ఆ పార్టీ మద్దతు ఇవ్వడానికి సమ్మతించడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ ఉన్నప్పటికీ కెసిఆర్ మజ్లీస్ మద్దతు ఎందుకు కోరుతున్నారనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 60 మంది శాసనసభ్యుల అవసరం కాగా, తెరాసకు 63 మంది శాసనసభ్యులున్నారు.
అతి స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండడంతో తన తెలంగాణ ప్రభుత్వాన్ని పటిష్టపరచకోవడానికి మజ్లీస్ మద్దతును కెసిఆర్ ఆహ్వానించారని అనుకోవచ్చు. కానీ, అంతకన్నా ముఖ్యమైన ఇతర అంశాలు ఉన్నాయి. 2019 కన్నా ముందుగానే తాము తెలంగాణలో అధికారంలోకి వస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణలో పటిష్టమైన ప్రతిపక్షం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఇరువురు నాయకుల ప్రకటనలను కెసిఆర్ హెచ్చరిక మాదిరిగా తీసుకుని ఉంటారు.

వచ్చే ఎన్నికలలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబుకు కాంగ్రెసు మద్దతు ఇవ్వడం, తన పార్టీని చీల్చడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యం లేదని కెసిఆర్ భావించి ఉంటారు. హరీష్ రావు విషయంలో తెలుగుదేశం పార్టీ కెసిఆర్కు ఆ భయాన్ని ఇదివరకే పెట్టారు. అయితే, ఇది కూడా అంత సులభమైంది కాకపోవచ్చు గానీ మరో భయం కెసిఆర్కు ఉంది. మరో వ్యూహం కూడా ఆయనకు ఉంది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 24 శాసనసభా స్థానాల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీ కలిసి 24 సీట్లు గెలుచుకున్నాయి. ఇంతకు ముందు ఒక్క శాసనసభ్యుడు మాత్రమే ఉన్న బిజెపి ఈ రెండు జిల్లాల్లో ఐదు స్థానాలను పొందింది. కాంగ్రెసు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ వంటి మాజీ మంత్రులు ఓటమి పాలయ్యారు. ఆ సీట్లలో బిజెపి పాగా వేసింది. తెరాసకు 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అవి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకుల వల్ల గెలిచినవే గానీ తెలంగాణవాదం వల్ల గెలిచినవి కాదు. ఈ స్థితిలో హైదరాబాదుపై తన ప్రభుత్వం పట్టు సాధించడం కష్టం కావచ్చు.
ముస్లింలను తన వైపు తిప్పుకోవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. అందుకు గాను ఆయన ముస్లిం ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. తెరాస నుంచి షకీల్ అహ్మద్ ఒక్కరు మాత్రమే గెలిచారు. ఆయన నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఆయనకు అనుభవం లేకపోవడం వల్ల మజ్లీస్ను కలుపుకుని అక్బరుద్దీన్కు ఆ పదవి ఇవ్వడం వల్ల రెండు విధాలుగా కలిసి వస్తుందని భావిస్తున్నారు.
హైదరాబాదులో ఏ విధమైన సమస్యలు సృష్టించకుండా ఉండడానికి, సమస్యలు సృష్టిస్తే ఎదుర్కోవడానికి మజ్లీస్ సాయం అవసరమని కెసిఆర్ భావించి ఉండవచ్చునని అంటున్నారు. మజ్లీస్కు ఏడు శాసనసభా స్థానాలున్నాయి. పైగా, హైదరాబాద్ పాతబస్తీలో ఆ పార్టీకి తగిన బలగం ఉంది. తెలంగాణలో ప్రభుత్వం సాఫీగా సాగాలంటే హైదరాబాద్ పాతబస్తీ ప్రశాంతంగా ఉండడం అవసరం. భవిష్యత్తులో ముస్లింల మద్దతు పొందడానికి కూడా ఇది పనికి వస్తుందని కెసిఆర్ భావించి ఉంటారు. ఈ కారణాలతో కెసిఆర్ మజ్లీస్ మద్దతు కోరి ఉంటారని అంటున్నారు.
మజ్లీస్ కూడా తెరాస ఆహ్వానానికి సానుకూలంగా ప్రతిస్పందించింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నందున తమకు తెరాస ప్రభుత్వం మద్దతు అవసరమని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ భావిస్తూ ఉండవచ్చు. కాంగ్రెసు పూర్తిగా బలహీనమైన స్థితిలో మజ్లీస్కు తెరాస ఆసరా అవసరంగా మారిందని అంటున్నారు. అయితే, మజ్లీస్ తెరాస ప్రభుత్వంలో చేరుతుందా లేదా అనేది తెలియదు. త్వరలో అసదుద్దీన్ ఓవైసీ కెసిఆర్తో సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో ఆ విషయం తేలే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications