జగన్తో చిరంజీవి భేటీ, వైసిపిలోకి వెళ్తారని ప్రచారం: ఇదీ విషయం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? విదేశాల్లో ఆ పార్టీ అధినేత జగన్తో భేటీ అయ్యారా? అంటే అవును.. అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? విదేశాల్లో ఆ పార్టీ అధినేత జగన్తో భేటీ అయ్యారా? అంటే అవును.. అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అయిత అదంతా వట్టిదే.

విదేశాల్లో చిరు, జగన్
ప్రస్తుతం చిరంజీవి, జగన్లు ఇరువురు కూడా విదేశాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ చర్చ సాగుతోంది. అక్కడ ఇరువురు నేతలు కలుసుకున్నారని, మెగాస్టార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా వెళ్లవచ్చునని పేర్కొంటున్నారు. ఇరువురి మధ్య రాజకీయపరమైన చర్చ జరిగిందని అభిప్రాయపడుతున్నారు.

వేర్వేరు దేశాల్లో..
ప్రస్తుతం జగన్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. చిరంజీవి మాత్రం చైనాలో ఉన్నారు. రెండు వారాల పాటు విహారయాత్రలో భాగంగా జగన్ కుటుంబంతో సహా న్యూజిలాండ్ వెళ్లారు. ఇక, చిరంజీవి ఇండస్ట్రీ వాళ్లతో కలిసి చైనాలో ఉన్నారు. ప్రతి ఏటా సినీ పరిశ్రమలోని చిరంజీవి తరం ఈ కార్యక్రమం పెట్టుకుంటుంది. అందరూ కలుస్తారు. దీని కోసం చిరంజీవి అక్కడ ఉన్నారు. అంతేకాదు, చైనాలో ఉన్నట్లు చిరంజీవికి సంబంధించిన ఫోటోలు కూడా విడుదలయ్యాయి.

కలిసే ఛాన్స్ లేదు
జగన్ న్యూజిలాండులో ఉండగా, చిరంజీవి చైనాలో ఉన్నారు. అలాంటప్పుడు కలిసే అవకాశమే లేదని అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఇరువురు నేతలు భేటీ అయినట్లు ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం లేదు
చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలు ఏమాత్రం లేదంటున్నారు. అంతగా వీడాల్సిన పరిస్థితి వస్తే తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు మద్దతు పలుకుతారే తప్ప.. జగన్ స్థాపించిన వైసిపిలో ఎందుకు చేరుతారని అంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అంతా వట్టిదే అంటున్నారు.

పనిగట్టుకొని అసత్య ప్రచారం
సోషల్ మీడియాలో పనిగట్టుకొని అసత్యప్రచారం చేయడం పెరిగిపోయిందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ శాసన సభ, టిడిపి ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇద్దరు అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications