డీసీసీబీ: శ్రీదేవికి షాక్, 'ఆళ్లగడ్డ'కు టీడీపీ దూరం?
కర్నూలు: కర్నూలు జిల్లా డీసీసీబీలో చైర్ పర్సన్ శ్రీదేవి పైన పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని రహస్యంగా జరిపినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. లోపలకు మీడియాను అనుమతించలేదు. దీంతో పోలీసులకు, మీడియాకు మధ్య వాగ్వాదం జరిగింది.
అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో డీసీసీబీ చైర్మన్ పదవిని శ్రీదేవి కోల్పోయారు. మరో వారం రోజుల్లో కొత్త చైర్మన్ను ఎన్నుకోనున్నారని తెలుస్తోంది. కాగా, శ్రీదేవి కోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటుందా?

ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని భావిస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈసీ పోలింగ్ తేదీ ప్రకటించిన తర్వాత టీడీపీ అధికారికంగా ఓ ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో పోటీ చేసిన శోభా నాగిరెడ్డి ఎన్నికకు ముందే దుర్మరణం చెందారు. అయితే, ఆమె పేరును తొలగించలేదు. ఎన్నికల్లో ఆమె గెలిచారు. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉండగా, నందిగామ ఉప ఎన్నిక సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దూరంగా ఉంది. మృతి చెందిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తుండటంతో వైసీపీ దూరంగా ఉంది. దీనిని పరిగణలోకి తీసుకొని ఆళ్లగడ్డలో టీడీపీ కూడా దూరంగా ఉండవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications