'జైలుకెళ్లడం ఖాయం, నెంబర్ 2ని రెడీ చేసే పనిలోపడ్డ వైయస్ జగన్'
త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై చర్చిస్తారా? అని టిడిపి నేత వర్ల సవాల్ విసిరారు.
అమరావతి: త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై చర్చిస్తారా? అని టిడిపి నేత వర్ల రామయ్య సవాల్ విసిరారు.
సీబీఐ దాఖలు చేసిన 11, ఈడీ దాఖలు చేసిన 5 ఛార్జిషీట్ల ప్రకారం దేశంలో అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు జగనేనని వర్ల ఆరోపించారు. ఆయన అవినీతిపై వైసిపి ప్లీనరీలో ఆ పార్టీ నాయకులు చర్చించగలరా? అని ప్రశ్నించారు.
వైసిపి నేతలకు ఆ ధైర్యముందా?
విజయవాడలోని టిడిపి కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల మాట్లాడారు. ఛార్జిషీట్లవివరాలు, ముద్దాయిల పేర్లు, క్విడ్ ప్రోకో ద్వారా జగన్ పొందిన లబ్ధి వివరాలను వైసిపి నాయకులకు అందిస్తామని, వారికి ధైర్యముంటే ప్లీనరీలో వీటిపై చర్చించాలన్నారు.
నారా లోకేష్ను అంటారా?
తమ పార్టీ నేత, మంత్రి నారా లోకేష్పై అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదని వర్ల మండిపడ్డారు. వైసిపి నేతలు, జగన్ సాక్షి మీడియా తమ నాయకుడిపై అనుచితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
నెంబర్ 2ను రెడీ చేసే పనిలో జగన్
అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వర్ల అన్నారు. అందుకే వైసీపీలో నెంబర్ 2ని రెడీ చేసే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. త్వరలో జగన్ ఊచలు లెక్కిస్తారని చెప్పారు.
వైయస్ బతికుంటే..
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఈ కేసుల్లో ఆయన ఏ 1 ముద్దాయిగా ఉండేవారని, జగన్ ఏ 2 అయ్యేవారన్నారు. తండ్రి హయాంలో జగన్ ఇష్టారీతిగా దోచుకున్నారన్నారు. జగన్ను ఏ చట్టం కానీ, ఏ కోర్టు కానీ కాపాడలేవని వర్ల రామయ్య చెప్పారు.