మరో ఫేస్బుక్ మోసం...బిజినెస్ లో లాభాలంటూ యువతికి లక్షల్లో టోకరా
నెల్లూరు:ఫేస్బుక్ ద్వారా యువతిని పరిచయం చేసుకొని ఉపాధి పేరుతో ఆమెని నమ్మించి లక్షలు కోట్టేశాడో కాజేశాడో యువకుడు. అయితే అంతటితో ఆగకుండా మరోసారి మాయమాటలు చెప్పి మళ్లీ మోసం చేసేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఈసారి అప్రమప్తమైన ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల సాయంతో తానే ఎదురు స్కెచ్ వేసి ఆ ఛీటింగ్ మ్యాన్ ని కటకటాల వెనక్కి పంపింది. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...
ఫేస్ బుక్ పరిచయం...లోకల్ టచ్
నెల్లూరు జిల్లా కలువాయి మండలం రామన్న గారిపల్లెకు చెందిన ఎస్ లావణ్య హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈమెకు మూడేళ్ల క్రితం ఒంగోలుకు చెందిన సురేష్ అనే యువకుడు ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకున్నాడు. అయితే సురేష్ కూడా హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండడంతో తమ పక్క జిల్లా వ్యక్తి అని, మంచివాడని నమ్మింది. ఆ క్రమంలో సురేష్ ఒకసారి తనకు మంచి ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందని, నీవు కూడా కొంత పెట్టుబడి పెడితే షేర్ ఇస్తానని లావణ్యకు మాయమాటలు చెప్పి నమ్మించాడు.
ఆన్ లైన్ ద్వారా...లక్షల జమ
దీంతో అతడి మాటలు నమ్మిన లావణ్య ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పలు విడతలుగా రూ.5.62 లక్షలు సురేష్ ఖాతాకు జమచేసింది. అయితే సురేష్ తనకు లాభాలు వస్తాయని చెప్పిన సమయం గడచినా చెప్పిన విధంగా లాభంతో కలిపి డబ్బు ఇవ్వకపోగా మరో కహానీ వినిపించాడు. ఆ ప్రాజెక్ట్ వర్క్ విషయంలో పార్ట్ నర్ తనను మోసం చేశాడని, దీంతో తాను మోసపోయానని మన ఇద్దరి డబ్బు కూడా పోయిందని లావణ్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో షాక్ తిన్న లావణ్య ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న సురేష్ తన మాటలు నమ్మిందని సంతోషపడ్డాడు.
మరోసారి...మోసానికి రెడీ
ఆ తరువాత కొంతకాలం గడిచాక మళ్లీ లావణ్యకు ఫోన్ చేసిన సురేష్ ఈసారి తానే సొంతంగా ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభిస్తున్నానని, పార్ట్ నర్ లు అంటూ ఎవరూ లేనందువల్ల మోసపోయే ఛాన్స్ లేదని ఈసారి ఖచ్చితంగా డబ్బు సంపాదించవచ్చని, పాత డబ్బులు కూడా వచ్చేస్తాయని మళ్లీ నమ్మబలకడం ప్రారంభించాడు. జస్ట్ రూ.3లక్షలు పెట్టుబడి పెడితే షేర్ ఇస్తానని, ఈ సారి లాభాలు మనిద్దరం షేర్ చేసుకోవడమేనని చెప్పాడు. దీంతో సరేనన్నయువతి ఈ విషయాన్నికుటుంబ సభ్యులకు తెలిపింది.
కుటుంబ సభ్యులతో కలసి...కౌంటర్ స్కెచ్
దీంతో కుటుంబ సభ్యులు అందరూ కలసి సురేష్ కు బుద్ది చెప్పేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని ఆ తరువాత లావణ్యతో అతడికి ఫోన్ చేయించారు. తాను తొలివిడతగా రూ.50వేలు నగదు ఇస్తానని, నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండు వద్దకు రావాలని కోరింది. దీంతో సురేష్ హైదరాబాద్ నుంచి సోమవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న లావణ్య, ఆమె కుటుంబ సభ్యులు కలిసి సురేష్ను పట్టుకుని పోలీసులకు పట్టించారు. ఆ తరువాత జరిగిన మోసం అంతా పోలీసులకు చెప్పి సురేష్ పై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.