48వేల కోట్ల లెక్క తేలాలన్న యనమల రామకృష్ణుడు; ఆర్ధిక ఎమర్జెన్సీ అంటూ సంచలనం
తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని టార్గెట్ చేస్తున్న టిడిపి నేతలు ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుందని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఏపీ ఆర్ధిక పరిస్థితిపై యనమల రామకృష్ణుడు సంచలనం
మొదటినుంచి వైసీపీ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడిందని, ఆర్థిక వ్యవహారాలను వాస్తవాలకు విరుద్ధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను, ఇతరత్రా అంశాలను పట్టించుకోకుండా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందని, ఏపీ ఆర్థిక పరిస్థితి శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే ఘోరంగా ఉందని, త్వరలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం ఏపీ ఆర్థిక పరిస్థితిపై సంచలన ఆరోపణలు చేశారు.

48వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో లెక్క తేల్చాలి
48 వేల కోట్ల రూపాయల లెక్కల విషయాన్ని ప్రస్తావించిన యనమల రామకృష్ణుడు 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 48 వేల కోట్ల దుర్వినియోగంపై సిబిఐ విచారణ జరిపించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. స్పెషల్ బిల్లుల పేరుతో ఆ డబ్బును ఖర్చు పెట్టారని ప్రభుత్వం చెబుతోందని, ప్రజల కోసమే ఆ డబ్బులు ఖర్చు పెడితే దేనికి ఖర్చు పెట్టారో వివరాలు జగన్ ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఏపీ లో నిధుల దుర్వినియోగం జరుగుతుందని పేర్కొన్న ఆయన నిధులు దుర్వినియోగం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల జేబుల్లోకి 48వేల కోట్ల రూపాయలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు- అవినీతి తప్ప మరేమీ జరగలేదని పేర్కొన్నారు యనమల రామకృష్ణుడు. ప్రభుత్వం చెప్పుకునే స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోంది లేదని ఆయన పేర్కొన్నారు. కోర్టుల తీర్పులపై సభలో చర్చలో పెడుతున్నారని ఉభయ సభలను వాళ్ళ సొంతానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టులను, చట్ట సభలను కూడా తమ చేతుల్లోకి తీసుకునేలా వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. 48 వేల కోట్ల రూపాయల కు సంబంధించి లెక్కలు లేవని కాగ్ చెప్పిందని గుర్తు చేసిన యనమల రామకృష్ణుడు 1.58 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అందులో 48 వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు మాయం చేశారు అంటూ ఆరోపణలు గుప్పించారు.

ఏపీలో ఆర్ధిక పరిస్థితి అదుపులోకి తీసుకురావటం కోసం ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాలి
ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది లెక్క తేల్చాలని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు దిగమింగుతూ ఉన్నారని ఆరోపించిన యనమల కేంద్రం ఆదుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఏడాదిలో ప్రతిరోజు వేజ్ అండ్ మీన్స్ కింద అప్పులు తెచ్చారని, ప్రతి మూడు నెల రోజులకు ఓ డి కింద అప్పులు తెచ్చారని, అవి కాకుండా మార్కెట్ బారోయింగ్స్ కింద 55 వేల కోట్లు, హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ క్రింద లక్ష తొమ్మిది వేల కోట్ల అప్పులు తెచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులు దుర్వినియోగం విషయంలో కేంద్రం ఆర్టికల్ 360 అమలు చేయాలని యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడం కోసం ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని మరోమారు యనమల డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications