వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేశ్ బాబు, చివరి నిమిషంలో మారిన పేరు..
ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణ రాజును (డాక్టర్ సురేశ్ బాబు) బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. సురేశ్ బాబు.. దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు, ఇటీవల సాంబశివరాజు చనిపోగా.. ఆయన కుమారుడికి జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మాజీమంత్రి మోపిదేవి వెంకట రమణ రాజీనామాతో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.
మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్ బాబు పేరును సీఎం జగన్ ఖరారు చేశారు. నామినేషన్ దాఖలుకు ఈ నెల 13 చివరి తేదీ కాగా.. మొదట వేరే వారి పేరుని జగన్ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. తొలి నుంచి వైసీపీతో ఉంటూ వస్తోన్న పెనుమత్స సాంబశివరాజు సోమవారం సాంబశివరాజు కన్నుమూశారు. సీఎం జగన్ ఫోన్లో కుటుంబాన్ని పరామర్శించి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే సురేష్ బాబుని ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ఆగస్ట్ 13 చివరి తేదీ కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి.. ఫలితాలను వెల్లడిస్తారు. మండలి రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మండలి నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ.. తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ ఏర్పడింది. మరోవైపు వారిద్దరినీ సీఎం జగన్ రాజ్యసభకు పంపించి... సముచిత ప్రాధాన్యం కల్పించారు.