రాజకీయాల్లోకి జగన్ సతీమణి?: టీడీపీ ప్లాన్ పసిగట్టే!, భారతికే బాధ్యతలు!?
ఎన్నికల నాటికి జగన్ ను జైల్లో పెట్టిస్తే.. టీడీపీకి లైన్ క్లియర్ అవుతుందనేది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని నడిపించడానికి వైఎస్ భారతి ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.
విజయవాడ: ఎన్నికలకు మరో రెండేళ్ల సమయమున్నా.. ఏపీలో మాత్రం అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలంటూ బాబు సంకేతాలివ్వడం దీనికి మరింత బలం చేకూర్చింది. దానికి తగ్గట్లే అధికార పార్టీ పావులు కూడా కదుపుతోంది.
ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో జగన్ కు చెక్ పెట్టడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు వ్యూహాలు రచించే పనిలో ఉన్నారు. అందుకు అనుగుణంగానే 'జగన్ అండ్ కో'పై అప్పుడే టీడీపీ ఆధిపత్యం మొదలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా జగన్ పై ఉన్న కేసులను తిరగదోడి ఆయన్ను మళ్లీ జైలుకు పంపించడానికి చంద్రబాబు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబు వ్యూహాల్ని పసిగట్టిన వైసీపీ కూడా అందుకు తగ్గట్లే ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే జగన్ సతీమణి వైఎస్.భారతి పేరు తాజాగా పొలిటికల్ తెర మీదకు వచ్చింది.

ఎందుకీ ఊహాగానాలు:
ఇటీవల సీబీఐ నుంచి జగన్ కు మళ్లీ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు నెమ్మదిగానే నడిచిన విచారణ పర్వం.. తిరిగి వేగం పుంజుకుంటుండం వెనుక టీడీపీ హస్తం ఉందన్న వాదనలు బలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి జగన్ ను జైల్లో పెట్టిస్తే.. టీడీపీకి లైన్ క్లియర్ అవుతుందనేది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని నడిపించడానికి వైఎస్ భారతి ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

కేంద్రం అండతో:
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అండదండలతో జగన్ ను జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ప్రస్తుతం ఏపీలో జోరుగా జరుగుతున్న చర్చ. జగన్ ను మరోసారి జైలుకు పంపించగలిగితే వైసీపీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయవచ్చనేది టీడీపీ మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది. దీంతో ముందుగానే అప్రమత్తమైన వైసీపీ.. ఒకవేళ జగన్ జైలుకెళ్లినా.. పార్టీ పట్టు సడలిపోకుండా ఉండటానికి భారతిని రంగంలోకి దించుతున్నట్లు చెబుతున్నారు.

విజయమ్మ ఓటమితో:
వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గతంలో విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వయసు రీత్యా, అనుభవం రీత్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయమ్మకు మరోసారి బాధ్యతలు అప్పజెప్పి ఆమెపై ఒత్తిడి పెంచడం కంటే భారతినే ఇందుకు కరెక్ట్ అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక గతంలో వైసీపీ ప్రచారకర్తగా వ్యవహరించిన షర్మిల సైతం ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా లేరు. అందువల్లే కొత్తగా భారతికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారతి సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తారా?
సాక్షి పత్రికను విజయవంతంగా నడిపిస్తున్న అనుభవం వైఎస్ భారతికి ఉంది. ఆ అనుభవం రాజకీయాల్లోను ఉపయోగపడుతుందని జగన్ భావించి ఉండవచ్చు. అందువల్లే వైసీపీలో జగన్ కు ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల నాటికి భారతి పొలిటికల్ ఎంట్రీ జరగవచ్చు.












Click it and Unblock the Notifications