తాళి బొట్ల తయారీ హక్కు మీకే!...వినూత్న హామీలతో జగన్ కు విశేష ఆదరణ
విజయనగరం:విశ్వబ్రాహ్మణులకు వైసిపి అధినేత జగన్ ఇచ్చిన హామీలకు వారి నుంచి విశేష ఆదరణ లభించింది. పాదయాత్ర సందర్భంగా జగన్ స్వర్ణకారులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇకపై మీరు మాత్రమే మంగళ సూత్రాలను తయారు చేసేలా హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాదు పోలీసుల వేధింపులు లేకుండా ఇప్పుడున్న చట్టానికి సవరణలు చేస్తామని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ సీటిచ్చి చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తామని వాగ్ధానం చేశారు. జగన్ ఇచ్చిన హామీలపై సంతోషం వ్యక్తం చేసిన విశ్వబ్రాహ్మణులు ప్రతిపక్ష నేతకు తమ ఆవేదన వినిపించగా అర్థం చేసుకొని స్పందించారని
సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తుండటంపై రాజకీయ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

విశ్వబ్రాహ్మణులకు...భరోసా
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నా వైసిపి అధినేత జగన్ 274 వ రోజు కోరుకొండలో కొనసాగుతుండగా విశ్వబ్రాహ్మణులు వచ్చి కలిశారు. ఈ సందర్భంగా సామాజిక, వృత్తిపరమైన సమస్యలను వారు జగన్కు వివరిస్తూ అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలని కోరారు. స్వర్ణకారులతో సుమారు అరగంట సమయం మాట్లాడి వారి సమస్యలను విన్న జగన్ తదనంతరం మాట్లాడుతూ మీకు వైసిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు మాత్రమే మంగళసూత్రాలను తయారు చేసేలా హక్కు కల్పిస్తామని వాగ్ధానం చేశారు. ఈ మేరకు తొలి చట్టసభలోనే తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోలీసుల వేధింపులు లేకుండా ఇప్పుడున్న చట్టానికి సవరణలు చేస్తామని చెప్పారు. విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సీటిచ్చి చట్ట సభల్లో స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

జగన్... ఏమన్నారంటే?...
"విశ్వ బ్రాహ్మణులు అడిగే ప్రతి డిమాండ్ న్యాయ సమ్మతమైనదే...అన్నీ చేయదగ్గవే...కార్పొరేట్ బంగారు దుకాణాలతో స్వర్ణకారులు పోటీపడలేకపోతున్నారనేది నూటికి నూరుపాళ్లు నిజం...వాళ్లు ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి బంగారాన్ని వస్తువులుగా మార్చే యంత్రాలను తెస్తున్నారనేది వాస్తవం...అంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో స్వర్ణకారులున్నారనే విషయం నాకు తెలుసు...అందుకే వాళ్ల ఆధిపత్యాన్ని తట్టుకోలేపోతున్నామనే మీ బాధ నాకర్థమైంది. కార్పొరేట్ జ్యుయలరీ షాపుల వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోతున్నామని, దీనికి పరిష్కారం కావాలని, విశ్వబ్రాహ్మణుల్లో ఒకరైన స్వర్ణకారులు చేస్తున్న డిమాండ్ పూర్తిగా ఆమోదయోగ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే...11 వస్తువులను చేనేత వృత్తుల వారు మాత్రమే తయారు చేయాలని ఏ విధంగా చెప్పారో, అదే మాదిరిగా మంగళసూత్రాలను తయారు చేసే హక్కును కార్పొరేట్ జ్యుయలరీలతో పోటీ పడలేని చిన్న చిన్న షాపులు నడుపుతున్న స్వర్ణ్ణకారులకే కల్పిస్తూ మొట్ట మొదటి చట్టసభలో తీర్మానం చేస్తాం"...అని జగన్ చెప్పారు

చట్టసభలోనూ...ప్రాతినిథ్యం
ఈ చట్టం వల్ల మంగళసూత్రాలను కార్పొరేట్ షాపుల్లో అమ్మలేరు. ఇవి మీ దగ్గరే దొరుకుతాయి కాబట్టి కొద్దో గొప్పో బతకడానికి ఇది ఆశ కల్పిస్తుంది. అలాగే జీవో నంబర్ 272లో అభ్యంతరకరమైన క్లాజులున్నాయని, దొంగ బంగారం తెచ్చారని పోలీసులు విచక్షణా రహితంగా హింసిస్తున్నారని స్వర్ణకారులు నాకు చెప్పారు. మనం అధికారంలోకి రాగానే ఈ చట్టంలో మార్పులు తెస్తాం. వ్యవస్థ బాగుపడేలా, వ్యవస్థ వల్ల మీరు నష్టపోకుండా, మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుని పోలీసుల నుంచి వేధింపులు లేకుండా చట్టంలో మార్పులు తీసుకొస్తాం. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదని ప్రతి నియోజకవర్గంలో స్వర్ణకార సోదరులు చెబుతున్నారు. మీకూ ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్నారు. దీనికి పరిష్కారంగా మీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే స్థానం ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెడతాను.

రాజకీయ నాయకులు...చేతులు పెట్టకూడదు
బీసీ-బిలో ఉన్న వారిని బీసీ-ఏగా చేయాలని మీరు అడిగారు. కానీ ఈ విషయంలో మాత్రం నేను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. రాజకీయ నాయకులు కులాల వ్యవస్థలో వేలు పెట్టకూడదు. అలా చేసి, బీసీ-బిలను బీసీ-ఏగా చేస్తామని, ‘సి'ని ‘ఏ'గా మారుస్తామని వాళ్లు వేలు పెట్టి మాట్లాడతారో...అప్పుడు బీసీలకు మేలు కన్నా అన్యాయమే ఎక్కువ జరుగుతుంది. దీన్ని రాజకీయ నాయకులు పారదర్శకంగా వదిలేయాలి. బీసీ కమిషన్ను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. మీ దగ్గర్నుంచి వచ్చిన డిమాండ్ను కమిషన్కు అప్పజెపుతాం. కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటే అదే...మేము దాంట్లో వేలు పెట్టం. న్యాయంగా, ధర్మంగా ఏ కులం ఎక్కడుండాలనేది వాళ్ల విచక్షణకే వదిలిపెడతాం. ఎందుకంటే రాజకీయ నాయకుడు వేలు పెడితే ఆ కులం ఓట్లను ప్రభావితం చేసేందుకు ‘ఏ'లను బీలుగా, ‘బీ'లను ‘సీ'గా మారుస్తాడు. ఇలా చేయడం వల్ల చాలా కులాలు నష్టపోతాయి. కొన్ని కులాల ఓట్ బ్యాంక్ కోసం మిగిలిన కులాలు నష్టపోయే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోతుంది. కాబట్టి ఈ ఒక్క విషయం కాకుండా మిగిలిన మీరు అడిగిన ప్రతి ఒక్కటీ సంపూర్ణంగా నెరవేరుస్తానని విశ్వబ్రాహ్మణులకు జగన్ హామీ ఇచ్చారు.

విజయనగరంలో...అనూహ్య స్పందన
అయితే విజయనగరం జిల్లాలో జగన్ లభిస్తున్న అనూహ్య ఆదరణపై రాజకీయ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కారణం ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచు కోటలుగా ఉండేవి...ఆ తరువాత కొంత అటూ ఇటూ అయినా మళ్లీ గత ఎన్నికల్లోనూ మెజరిటీ సీట్లు కట్టబెట్టడం ద్వారా మళ్లీ టిడిపికే పట్టం కట్టేశారు. అయితే గడచిన నాలుగేళ్లలో వారి ఆకాంక్షలు నెరవేరకపోవడం వారి ఆలోచనల్లో మార్పు తెచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా విజయనగరం రాజుల కోట ప్రాతంలోనే జగన్ కు వస్తున్న విశేష ఆదరణ ఆ మార్పునకు సూచనగా భావించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్ పాదయాత్రలో అంతకుముందంతా ఒక ఎత్తయితే గోదావరి జిల్లాల నుంచి జనం స్పందన భారీగా ఉంటూ అదే ఆదరణ విజయనగరం వరకూ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. పైగా విజయనగరం జిల్లాలో జగన్ కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతుండటం చర్చనీయాంశంగా మారింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications