ఏపీని నిలదీస్తున్న కేసీఆర్కు జగన్ మద్దతు: బాబు
హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులను తాము అడ్డుకోలేదని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. అనుసంధానంపై తమ అనుమతి కావాలన్న కేసీఆర్కు మద్దతుగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో చేపట్టనున్న పట్టిసీమ ప్రాజెక్టుతో తెలంగాణ సీఎం కేసీఆర్కు సంబంధం లేదని చెప్పారు. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకోవాలంటే తన అనుమతి తీసుకోవాలని కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. రాయలసీమకు నీళ్లు రావొద్దని జగన్ కోరుకుంటున్నారని, అందుకే అలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
పక్క రాష్ట్రాల్ని రెచ్చగొట్టేందుకే: దేవినేని
పక్క రాష్ట్రాలను రెచ్చగొట్టేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షి కథనాలు రాస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.
12 కేసుల్లో ముద్దాయి: పత్తిపాటి పుల్లారావు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 12 కేసుల్లో తొలి ముద్దాయి అని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ అంటే ప్రజలకు అసహ్యమేస్తోందన్నారు. చంద్రబాబుపై మాట్లాడే ముందు వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
బాబుపై ధీటుగా స్పందించిన కోటంరెడ్డి
వైసీపీ రౌడీయిజం చేసేందుకు శాసన సభ ఏం ఇడుపులపాయ కాదన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రతిపక్షాన్ని అధికార పార్టీ భయపెట్టడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడేందుకు ఇదేం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదన్నారు.