బాబు వ్యూహానికి జగన్ ఏడు వికెట్లు డౌన్: ఎనిమిదో వికెట్ ఎవరు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్రీడలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడు వికెట్లు కోల్పోయారు. ఎనిమిదో వికెట్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. రాయలసీమలో జగన్ను బలహీనపరచడం, ఉత్తరాంధ్రలో బాక్సైట్ ఉద్యమాన్ని తగ్గించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
తద్వారా 2019 ఎన్నికలకు మార్గం సుగమం చేసుకుంటున్నారు కూడా. రోజుకొక్కరు అన్నట్లు శాసనసభ్యులు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతుండడంతో వైయస్ జగన్ దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయారనిపిస్తోంది. విద్యార్థులతో భేటీలను, జిల్లా పర్యటనలను పక్కన పెట్టి ఆయన శాసనసభ్యులను రక్షించుకునే పనిలో పడ్డారు. అయినా ఫలితం ఉండడం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసును చావుదెబ్బ తీసే పనిలో పడ్డారు. ‘పార్టీలో చేరేవారు.. ఇంకా ఉన్నారు... సర్దుకుపోవాలని' చంద్రబాబు మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో నేతలతో వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే వైసీపీ నుంచి వచ్చిన వారి సంఖ్య శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణతో కలిపి 7కు చేరింది. దీంతో నెంబర్ 8 ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటివరకూ టిడిపిలోకి వచ్చిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. సీమలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బకొట్టాలనే యోచనతోనే కార్యకర్తల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఆ నలుగురిని పార్టీలో బాబు పార్టీలో చేర్చుకున్నారు. అదీ వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటలా భావించే సొంతజిల్లా కడప నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో జగన్ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టినట్లయింది.
కాస్తా వైసిపికి పట్టు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కుంటే వైసీపీని నైతికంగా దెబ్బతీసినట్టేనని టీడీపీ భావిస్తోంది. ప్రకాశం జిల్లాలో వైసిపి నేతలు బలంగానే ఉన్నారు. ఈ జిల్లాలో కూడా వైసీపీని దెబ్బకొట్టి పార్టీ బలం పెంచుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
అన్ని జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షించే బాధ్యత చంద్రబాబు మంత్రులకు అప్పగించారని అంటున్నారు. ఇప్పటి వరకూ వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన శాసనసభ్యులు - భూమా నాగిరెడ్డి (నంద్యాల) , అఖిలప్రియ (ఆళ్లగడ్డ), ఆదినారాయణ రెడ్డి (జమ్మలమడుగు), జలీల్ఖాన్ (విజయవాడ పశ్చిమ), డేవిడ్ రాజు (ఎర్రగొండపాలెం), జయరాములు (బద్వేలు), కలమట వెంకటరమణ (పాతపట్నం).












Click it and Unblock the Notifications