మీరంతా ఓకే, రోజాగారికి నో: చీఫ్ మార్షల్తో జగన్ వాగ్వాదం, రికార్డింగ్ ఇదీ..
హైదరాబాద్: శుక్రవారం ఉదయం అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యే రోజాను భద్రతా సిబ్బంది లోనికి అనుమతించ లేదు. ఇందుకు సంబంధించి వారితో వాగ్వాదానికి సంబంధించిన రికార్డింగులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాకు అందించారు.
రోజాకు చేదు అనుభవం ఎదురు కావడాన్ని వైసిపి నేతలు సీరియస్గా తీసుకున్నారు. గవర్నర్కు ఫిర్యాదు చేశారు. శనివారం నల్ల కండువాతో సభకు హాజరు కావాలని నిర్ణయించారు. దీనిపై హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
కాగా, ఏపీ అసెంబ్లీ గేటు బయటే రోజాను మార్షల్స్ అడ్డుకున్న సందర్భంలో ఆమె వెంట జగన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా ఉన్నారు. ఆమెను లోపలికి అనుమతించే విషయం పైన చీఫ్ మార్షల్తో అధినేత జగన్ గట్టిగా నిలదీశారు.

తమను అసెంబ్లీలోకి ఎందుకు వెళ్లనివ్వాలని చెప్పారు. తమను అడ్డుకునే అధికారం ఎవరిచ్చారని మండిపడ్డారు. అందుకు చీఫ్ మార్షల్ స్పందిస్తూ... మిమ్మల్నందర్నీ లోపలికి అనుమతిస్తామని, కానీ మేడమ్ గారు రోజాగారినైతే మాత్రం అనుమతించమని చెప్పారు.
దీనికి జగన్ స్పందిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీని నిన్న అసెంబ్లీ సెక్రటరీకి సమర్పించామని, ఇక ఇబ్బంది ఏమిటని చీఫ్ మార్షల్ను ప్రశ్నించారు. తనకు పై నుంచి ఆదేశాలు లేవని, మేడమ్ గారిని మాత్రం లోపలికి అనుమతించనని చీఫ్ మార్షల్ చెప్పారు.












Click it and Unblock the Notifications