మోడీదంతా మేడిపండు: చిరు, జగన్ సీక్రెట్గా: రఘువీరా
హైదరాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభివృద్ధి మేడిపండులాంటిదని కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి అన్నారు. బహుళ జాతి కంపెనీలతో కోట్లు వెచ్చించి నరేంద్ర మోడీ లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. తన అభిమానుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తనతో పాటు తన అభిమానులు కాంగ్రెసులో చేరినట్లేనని ఆయన చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బిజెపితో రహస్య ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెసు సీమాంధ్ర అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులోని ఇందిరాభవన్లో మంగళవారం ఏర్పాటైన చిరంజీవి అభిమానుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

తాము పదవుల కోసం పాకులాడడం లేదని, అవకాశవాదులకు అవకాశం ఇవ్వకూడదని చెబుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్రలోని 175 శాసనసభా స్థానాలకు 1300 దరఖాస్తులు వచ్చాయని, అందరికీ టికెట్లు ఇవ్వలేమని ఆయన అన్నారు. చిరంజీవి అభిమానుల నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయని, చిరంజీవి అభిమానులకు కూడా ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు అన్ని విభాగాల్లో చిరంజీవి అభిమానలు
సుదీర్ఘంగా కాంగ్రెసులో పనిచేస్తున్నవారికి టికెట్లు ఇస్తామని ఆయన చెప్పారు. 70 శాతం కొత్త ముఖాలు ఉంటాయని చెప్పారు. బలహీనవర్గాలకు టికెట్లు ఎక్కువగా కేటాయిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు వెళ్లిపోయారని బాధపడవద్దని, వారు వెళ్లినందు వల్ల కొత్త రక్తం వస్తుందని ఆయన అన్నారు.
సీమాంధ్రలో బిసి నేతను ముఖ్యమంత్రిగా చేస్తానని చంద్రబాబు చెప్పగలరా అని ఆయన అడిగారు. విజయావకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని ఆయన చెప్పారు. పది లక్షల మందిని కాంగ్రెసులో చేర్పించాల్సిన బాధ్యత అబిమాన సంఘాలదేనని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వట్టి వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications