జగన్ రోగానికి మందుల్లేవ్, వదలం: దేవినేని, సాక్షిలో వచ్చేవన్నీ అవే: బాబు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టుల పైన జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
ప్రాజెక్టుల పూర్తికి తాము పూర్తి అంకిత భావంతో పని చేస్తున్నామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పైన అర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పైన బురద జల్లే వైఖరిని జగన్ మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజాయితీగా పని చేస్తున్నారన్నారు.
కొండవీటి వాగుతో పాటు ఇతర ప్రాజెక్టులపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న జగన్ మీడియాపై న్యాయపరంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. తాము శక్తి వంచన లేకుండా పని చేస్తుంటే ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించమన్నారు.
జగన్ సమాజ వ్యతిరేక మానసిక సమస్య అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారన్నారు. ఈ వ్యాధికి మందులు కూడా లేవని, చిన్న తనంలో అయితే కౌన్సెలింగ్ ద్వారా నివారించవచ్చన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే నేతలు ఆ పార్టీ వీడి తమ వైపు వస్తున్నారన్నారు.
శనివారం చంద్రబాబు కూడా జగన్ పైన మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కాంగ్రెస్, వైసిపిలు కావాలనే రాజధాని అంశంపై విషం చిమ్ముతున్నాయన్నారు. ప్రతి పనికీ అడ్డంకులు కల్పిస్తున్నాయని ధ్వజమెత్తారు.
అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని, ఇదో అత్యంత శక్తివంతమైన కేంద్రంలా, శక్తిపీఠంలా తయారవుతుందన్నారు. నేలపాడు రైతులకు స్థలాల కేటాయింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరికీ అందుబాటులో ఉండాలనే విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు.

తాను పిలుపు ఇస్తే తనపై నమ్మకంతో మీరు 33 వేల ఎకరాలు ఇచ్చారని, సింగపూర్ వంటి నగరం నిర్మిస్తానని నేనే చెప్పానని, మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పని చేస్తున్నానని, మీరు సీఆర్డీఏకు భూములు ఇచ్చారని, సీఆర్డీఏ మీకు స్థలాలు ఇస్తోందని, మధ్యలో అవినీతికి తావు ఎక్కడుందని వ్యాఖ్యానించారు.
రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ వైసిపి, కాంగ్రెస్లు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మంచి రాజధాని వస్తే చూసి ఓర్వలేకే ఇలా చేస్తున్నాయి. సాక్షి పత్రికలో వచ్చేవన్నీ అసత్యాలే అన్నారు. ఒకప్పుడు డిటెక్టివ్ నవలలు చదివేవాళ్లమని, అదంతా కాల్పనిక సాహిత్యం అన్నారు. సాక్షిలో వచ్చే వార్తలు కూడా అలాంటివేనని ఎద్దేవా చేశారు.
రాజకీయ కారణాలతో రెచ్చగొట్టడం వల్ల కొందరు భూములు ఇవ్వలేదని, వారు ఇప్పటికైనా ఇస్తే సంతోషమని, లేకపోతే అక్టోబరులోగా భూసేకరణ ద్వారా ఆ భూములు తీసుకుంటామన్నారు. ప్రధాని సహా దేశ, విదేశీ ప్రముఖులు పాల్గొన్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవని వ్యక్తికి రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? అని వైసిపి నేత జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తలు రాసే పత్రికలపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications