ఈలోపే మిమ్మల్ని కలవాలి: మోడీకి జగన్ లేఖ, ఆయనది మూర్ఖత్వమని మంత్రులు
హైదరాబాద్: అపాయింట్మెంట్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం లేఖ రాశారు. ఈ నెల 22వ తేదీ లోపు కలవడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు. ప్రత్యేక హోదాపై ప్రధానితో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో చెప్పారు.
ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ లోపలే తనకు సమయం కేటాయించాలని జగన్ ప్రధానిని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని కార్యాలయానికి (పిఎంవోకు) లేఖ రాశారు. ఎన్నికల సమయంలో మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఆ హామీని మోడీ నెరవేర్చాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

కాగా, జగన్ తీరుపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు. జగన్ తమకు సమయం ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఫోన్లో కూడా మాట్లాడడానికి ముందుకు రావడం లేదని వారు శనివారంనాడు చెప్పారు.
ప్రతిపక్ష నేత అంటే ఎలా ఉండాలో తెలంగాణ నేత జానా రెడ్డిని చూసి జగన్ నేర్చుకోవాలని వారు సూచించారు. జగన్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం చంద్రబాబు నాయుడి ఇంట్లో ఫంక్షన్ కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఫంక్షన్ అని వారు చెప్పారు. హైదరాబాదులో ప్రముఖులకు ఆ ఇద్దరు మంత్రులు అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాలు అందిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications