నెల్లూరులో వైయస్, ఖనిలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
నెల్లూరు/కరీంనగర్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం రామాపురం సెంటరులో శనివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అనంతరం దానికి నిప్పు పెట్టారు.
ఈ విషయం తెలిసిన వెంటనే వరికుంటపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విగ్రహం కాలిపోతుండటంతో మంటలు ఆర్పివేశారు. ఈ ఘటన పైన విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
గోదావరిఖనిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ఆంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పలు దళిత సంఘాలు, అంబేడ్కర్ వాదులు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. శ్రీపాద రావు విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డిని పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేశారు. వంశీచంద్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, వెల్దండ మండలంలో రేపు రీపోలింగ్ జరగనుండడంతో ముందస్తుగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు బిజెపి అభ్యర్థి ఆచారీని కూడా అదుపులోకి తీసుకున్నారు.