ఏపీలో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు - ప్రశాంత్ కిషోర్ కొత్త ఫార్ములా : సీఎం జగన్ సిద్దమా-నేడే క్లారిటీ..!!
ఏపీలో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో కలవనుంది. వైసీపీ పొత్తు పెట్టుకొనే ఛాన్స్ ఉందా. ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. సంచలన ప్రతిపాదనలు జాతీయ స్థాయిలో చర్చకు కారణమవుతున్నాయి. వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కీలకంగా మారారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన ఇద్దరు ముఖ్యమంత్రులకు రాజకీయ వ్యవహారాల్లో కీలకమయ్యారు. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు..అవసరమైతే పార్టీలో చేరి తన సేవలు అందించేందుకు సిద్దమయ్యారు. దీని కోసం ఆయన జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాలకు తెర తీస్తూ..కొత్త ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన..
అందులో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయ వ్యూహాల పైన కాంగ్రెస్ కు ఇచ్చిన ప్రజెంటేషన్ బయటకు వచ్చింది. అందులో భాగంగా.. ఏపీలో వైసీపీతో జత కట్టాలని సూచించారు. తెలంగాణ లో ఒంటరిగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. అదే విధంగా తమిళనాడులో డీఎంకేతో..మహారాష్ట్రలో ఎన్సీపీ.. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీతో..ఇలా ఏ రాష్ట్రంలో ఎవరితో కలవాలనే అంశం పైన సూచనలు చేసారు.
5-6 పార్టీలతో పొత్తుల ద్వారా 2024 ఎన్నికల్లో అధికారానికి దగ్గర అవ్వచ్చనేది ప్రశాంత్ కిషోర్ వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా మార్పులను ఆయన సూచించారు. అయితే, ఇప్పుడు ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన సూచన తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.
ఏపీలో కాంగ్రెస్ తో కలవటం సాధ్యమేనా
2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యేందుకు రాజకీయంగా వ్యూహాలు అందిస్తూ..సహకరించిన ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాల పైన పూర్తి అవగాహన ఉంది. ఈ సమయంలో ఆయన చేసిన ప్రతిపాదన వెనుక వ్యూహాలు ఏంటనేది కీలకంగా మారుతున్నాయి. అసలు.. ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదన పైన అసలు జగన్ సుముఖత వ్యక్తం చేస్తారా అనేది సందేహమే. వైఎస్సార్ మరణం తరువాత.. జగన్ ఓదార్పు యాత్రకు అడ్డుచెప్పటం.. ఆ తరువాత జగన్ కొత్త పార్టీ..సీబీఐ కేసులు..16 నెలల జైలు..వీటికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని వైసీపీ నేతలు ఇప్పటికీ చెబుతారు.
వైసీపీ ఆవిర్భావం - రాష్ట్ర విభజన తో 2014 ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. ఎక్కడా ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు.
ఒంటరిగానే అంటున్న వైసీపీ..
2019 ఎన్నికల సమయంలో మాత్రం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ..టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ ఆవిర్భావ మూలాలను సైతం పక్కన పెట్టి..కాంగ్రెస్ తో జత కలిశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితం కావటానికి చెప్పుకొనే కారణాల్లో ఇది కూడా ప్రధానమైనది. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ ను ఇప్పటికీ ఏపీ ప్రజలు ప్రధాన దోషిగానే చూస్తున్నారు.
ఇక, టీడీపీ వర్సెస్ వైసీపీ అదే విధంగా చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా మారిన రాష్ట్రా రాజకీయాల్లో కాంగ్రెస్ నామ మాత్రంగా మారింది. పొత్తుల విషయంలో తొలి నుంచి జగన్ క్లారిటీతో ఉన్నారు. ఏపీలో టీడీపీ - జనసేన లేదా బీజేపీ లేదా మూడు పార్టీలు కలిసి వచ్చినా..తాము మాత్రం సింగిల్ పోటీ చేస్తామని పదే పదే వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఏపీ రాజకీయాల్లో బిగ్ డిబేట్ గా..
ఇక, 2019 ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మాత్రం కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తమకు సంబంధం లేదని..ఏపీకి హోదా ఎవరు ఇస్తే వారికి తమ మద్దతు ఉంటుందని జగన్ నాడు స్పష్టం చేసారు. కానీ, అనూహ్య మెజార్టీతో తిరిగి ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కేంద్రంలోని ముఖ్యులతో జగన్ హోదా అంశం పైన నిలదిసే పరిస్థితి లేకపోయినా..ఏపీలో పరిస్థితులతో కలిసే ముందుకు సాగుతున్నారు.
ఇప్పుడు, సోనియా సారధ్యంలోని కాంగ్రెస్ ఏపీలో వైసీపీ పొత్తు కోసం ముందుకు వచ్చినా..జగన్ అందుకు అంగీకరించే అవకాశం ఉండదనేది పార్టీ నేతల అంచనా. వైఎస్సార్ - జగన్ అభిమానులు... ఏపీ ప్రజల్లోనూ ఇంకా కాంగ్రెస్ పైన ఆగ్రహం తగ్గలేదని విశ్లేషిస్తున్నారు.
నేడే ఒంగోలు వేదికగా జగన్ క్లారిటీ...
ఇక, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా ప్రతిపాదన ను టీడీపీ రాజకీయంగా అందిపుచ్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు వైసీపీ అధినేత ..సీఎం జగన్ దీని పైన ఈ రోజు ఒంగోలు సభలో స్పందించే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా..పొత్తుల అంశం పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ - వైసీపీ పొత్తు పైన చేసిన ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది.