'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!!
అమరావతి కేంద్రంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ రాజముద్ర వేసేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ కేబినెట్.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం చేసిన తీర్మానం కేంద్రానికి చేరింది. కేంద్ర కేబినెట్ లో ఆమోదించి.. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీలో తీర్మానం వేళ గైర్హాజరైన వైసీపీ.. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ కేంద్రం గా మంత్రాంగం సాగినట్లు తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
అమరావతి ఇక ఏపీ శాశ్వత రాజధానిగా మారనుంది. పార్లమెంట్ ఈ మేరకు బిల్లును ఆమోదించి రాజముద్ర వేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఏపీ మంత్రివర్గం.. ప్రత్యేక అసెంబ్లీ భేటీలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదించారు. దీని ద్వారా ఇక భవిష్యత్ లో అమరావతి ఏపీ రాజధానిగా శాశ్వతంగా కొనసాగనుంది. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు రావటంతో అమరావతి వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. కాగా, జగన్ 11 సీట్లకే పరిమితం కావటానికి మూడు రాజధానుల నిర్ణయం పైన వ్యతిరేక తీర్పుగా విశ్లేషణలు జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి అవినీతి పైన పలు సందర్భాల్లో ప్రశ్నించిన జగన్.. మూడు రాజధానుల అంశం ప్రస్తావన చేయటం లేదు. అదే సమయంలో అసెంబ్లీలో బిల్లు సమయంలో వైసీపీ ముఖ్య నేత తాము అమరావతికి వ్యతిరేకం కాదని... మూడు రాజధానుల ప్రతిపాదన 2024 ఎన్నికల ముందు అంశమని స్పష్టం చేసారు.

పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ వైసీపీ నిర్ణయం ఏంటి..!?
ఈ సంకేతాల ద్వారా తాము అమరావతికి అనుకూలమనే చెప్పేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. కాగా, అమరావతి పైన ఇక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని జగన్ తో జరిగిన ముఖ్య నేతల భేటీలో అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో.. అమరావతిలో అవినీతి పైన ప్రశ్నిస్తూనే.. రాజధాని గా తాము అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టంగా ప్రకటన చేయాలని వైసీపీ నిర్ణయించినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ లో అమరావతి చట్టబద్దత బిల్లు సమయంలో తమ అభిప్రాయం స్పష్టం వెల్లడించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. పార్లమెంట్ సాక్షిగా అమరావతి పైన తమ విధానం ప్రకటించటం ద్వారా.. ఇక, ఈ అంశంలో తమ పైన ఉన్న వ్యతిరేకత తగ్గించుకునే విధంగా వైసీపీ వ్యూహం సిద్దం చేస్తోంది. అయితే.. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే అమరావతి బిల్లును ప్రవేశ పెడతామని చెబుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో.. ముందుగా దీని పై మరింత స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications