పవన్ చెప్పింది పచ్చి అబద్ధం: స్పష్టం చేసిన లోక్సభ
Pawan Kalyan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీలో 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, వాలంటీర్లు వాళ్లను మాయం చేశారని, అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధాలని లోక్సభ సాక్షిగా తేలిపోయాయి.
లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో- 2019 నుంచి ఏపీలో అమ్మాయిల మిస్సింగ్పై తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు బీకే పార్థసారథి, లావు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూరకంగా వివరణ ఇచ్చారు. గణాంకాలతో సహా వివరించారు.

2019లో బాలికలు/యువతులు కనిపించడంలేదంటూ 6,896 ఫిర్యాదులు అందాయని, వారిలో 6,583 మందిని పోలీసులు గుర్తించారని బండి సంజయ్ వివరించారు. 2020లో వచ్చిన ఫిర్యాదులు 7,576 కాగా వారిలో 7,189 మందిని ట్రేస్ అయ్యారు. 2021లో అందిన ఫిర్యాదులు 10,085 కాగా వారిలో 9,616 మందిని పోలీసులు గుర్తించారు.
అమ్మాయిలు కనిపించట్లేదంటూ 2022లో అందిన ఫిర్యాదులు 10,433. కాగా వారిలో 10,994 మందిని పోలీసులు గుర్తించారు. ఆ ఏడాది ఫిర్యాదుల కంటే ట్రేస్ అయిన వారి సంఖ్య అధికంగా ఉండటానికి గల కారణాలను వివరించారు కేంద్రమంత్రి బండి సంజయ్. అంతకు ముందు సంవత్సరాల్లో ట్రేస్ కానివారిని గుర్తించడం వల్ల 2022లో ఆ సంఖ్య పెరిగిందని అన్నారు.
2023లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 9,695 కాగా వారిలో 9,640 మందిని గుర్తించినట్లు ఆయన లోక్సభకు వివరించారు. లిఖితపూరకంగా సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. వైస్ జగన్ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ అందుబాటులో ఉండటం, స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసులు వద్దకు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారని అన్నారు.
బండి సంజయ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు సంధించింది. మిస్సింగ్ కేసులకు పలు కారణాలు ఉంటాయని పేర్కొంది. పరీక్షల్లో తప్పడం, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలు తదితర కారణాలు ఉంటాయని అభిప్రాయపడింది. ఈ ఘటనలన్నింటిలోనూ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేస్తారని గుర్తు చేసింది.
రికార్డుల్లో ట్రేస్ కాని వారు కూడా జీవితాలంలో స్థిరపడి ఉండొచ్చని, ఆయా కుటుంబాలతో రాజీచేసుకోవడం లాంటి పరిణామాల వల్ల అవి కూడా నమోదు కాలేదని అంచనా వేసింది. ఇలాంటి కేసులను రాజకీయంగా వాడుకుని పవన్ కల్యాణ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేశారని వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తింది.
ఇదే చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ 1,542గా ఉందని, వాళ్లందరూ అక్రమ రవాణాకు గురైనట్టేనా? అంటూ ప్రశ్నించింది వైస్ఆర్సీపీ. అప్పుడు ప్రచారాలు చేసినవారు, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీసింది.












Click it and Unblock the Notifications