వైఎస్ జగన్ బెయిల్ పిటీషన్ రద్దవుతుందంటూ కథనాలు: వైసీపీ సీరియస్: సీఐడీకి ఫిర్యాదు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందంటూ కొద్దిరోజులుగా వాట్సప్, సోషల్ మీడియాలో వెలువడుతోన్న కథనాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. బెయిల్ రద్దయితే అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడతారని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ప్రచారంలో ఉన్న కథనాలను వైసీపీ ఏపీ సీఐడీ దృష్టికి తీసుకెళ్లింది. దుష్ప్రచారానికి పాల్పడుతోన్న వారిపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది.
ఆస్తుల కేసులో వైఎస్ జగన్కు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ వైసీపీకే చెందిన తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సీబీఐ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ పిటీషన్పై ఇవ్వాళ సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువడుతుందని, న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెయిల్ రద్దు తప్పదనే కథనాలు, వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు తెలిపారు. ఈ మేరకు వారికి ఫిర్యాదు చేశారు.

బెయిల్ రద్దు తీర్పు వెలువడే రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాని ఆ కథనాల్లో రాసుకొచ్చారని పేర్కొన్నారు. అనంతపురం, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక వర్గానికి చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చివరికి పోలీసులను కూడా నమ్మవద్దంటూ అందులో సూచించినట్లు లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. 1988 డిసెంబర్, 1991 మేలో ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలను ఉదహరించారని అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను నీలి గూండాలుగా అభివర్ణిస్తూ.. వారిని మరోసారి ఎదుర్కొనక తప్పదని రాసుకొచ్చినట్లు చెప్పారు.
ఇవన్నీ కల్పిత కథనాలని, ప్రజల్లో భయాందోళనలను కలిగించేలా ఉన్నాయని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా, న్యాయస్థానాల్లో ఉన్న కేసుల నుంచి మాట్లాడటం సబ్ జ్యుడీష్ అనే విషయం తెలిసినప్పటికీ.. ఉద్దేశపూరకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసేలా కథనాలను రాసుకొచ్చారని చెప్పారు. అసత్య ఆరోపణలు, కథనాలు, కులాలు, మతాల మధ్య ఘర్షణలను సృష్టించే విధంగా వాటిని విస్తృతంగా సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తోన్నారని అన్నారు. అలాంటి పోస్టులను తొలగించడంతో పాటు, వాటిని పోస్ట్ చేసిన, ప్రోత్సహిస్తోన్న వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications