కిమ్ జాంగ్తో నారా లోకేశ్ మంతనాలు.. చంద్రబాబును ఉతికినా జగన్కు షాక్.. ఇదేందంటూ విజయసాయి పంచ్..
తెలుగుదేశం పార్టీ సారధ్య భాధ్యతలను యువ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు అప్పగించడాన్ని బట్టి.. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ 'తిండికి తిమ్మరాజు.. పనికి పోతురాజు' అని నిర్ధారణ అయిందని, ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించడానికి అమాయకుణ్ని బలిచేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎంపీ విజయసాయి సాయి రెడ్డి తాజాగా మరోసారి చెలరేగిపోయారు. ట్విటర్ వేదికగా తన పేరు కలిసొచ్చేలా 'సైరా పంచ్' అంటూ వరుసగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడేకంగా ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ ను సైతం ఏపీకి ముడిపెట్టేశారు..
సరస్వతికి సీఎం జగన్ ప్రాధాన్యం.. డబుల్'ఆర్'తో విధ్వంసం.. లేవకుండా 'లా'తో కొడతానంటూ..
లోకేశ్కు కొత్త పదవి..
తెలంగాణలో ఇప్పటికే ఉనికి లేకుండాపోయిన టీడీపీకి ఏపీ అధ్యక్షుడిగా రాంమ్మోహన్ నాయుడు, జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగుతుండగా.. పార్టీ అంతర్జాతీయ విభాగానికి అధ్యక్షుడిగా నారా లోకేశ్ ను నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విజయసాయి అన్నారు. ‘‘చినబాబును తెలుగు ప్రజలంతా ఛీకొట్టినక్రమంలో.. ఇక ఆయనిక్కడ మనుగడ సాధించడం కష్టమేనని చంద్రబాబు గుర్తించారు. అందుకే లోకేశ్ ను టీడీపీ ఇంటర్నేషన్ వింగ్ కు ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నారు. తద్వారా లోకేశ్.. కిమ్ జాంగ్ ఉన్ లాంటి ప్రపంచ స్థాయి నేతలతో మంతనాలు జరిపే అవకాశం ఏర్పడుతుంది''అంటూ ఎంపీ ఎద్దేవా చేశారు.
ప్రతిదీ షాకింగేనా?
జగన్ గద్దెనెక్కిన ఏడాది కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు, కీలక విధానాలపై కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండటం.. కొద్ది గంటల కిందటే.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలోనూ సుప్రీంకోర్టులో వైసీపీ సర్కారు వాదన వీగిపోవడం తెలిసిందే. అయితే చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం.. కోర్టులో జరిగిన అసలు విషయాన్ని, వాదోపవాదనల్ని, జడ్జిల వ్యాఖ్యల్ని ప్రజలకు చేరవేయడం లేదని విజయసాయి మండిపడ్డారు. ‘‘న్యాయస్థానాల్లో వాదనలను కూడా నిష్పాక్షికంగా చూపలేని నీచ స్థాయికి ఎల్లో మీడియా దిగజారి పోయింది. చంద్రబాబును ఉతికి ఆరేసినా.. జగన్ ప్రభుత్వానికి షాక్ అని రాయడం అలవాటై పోయింది. ప్రజలు నమ్మరని తెలిసినా, బాబు మెచ్చుకోలు కోసమే వాళ్లా పనిచేస్తున్నారు''అని ఫైరయ్యారు.
దేశంలోనే వినూత్నం
ఆర్థికంగా చితికిపోయి, కరోనా లాక్ డౌన్ దెబ్బకు మరింత కుదేలైపోయిన కులవృత్తుల వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ‘జగనన్న చేయూత' పేరుతో ప్రారంభించిన పథకం దేశంలోనే వినూత్నమైనదని ఎంపీ విజయసాయి గుర్తుచేశారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఏటా పది వేల సాయం అందించే పథం కొత్తదని, ఈ వర్గాలకు నేరుగా నగదు బదిలీ చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించదని చెప్పారు. కరోనా వల్ల ఆదాయ వనరులు తగ్గినా 247 కోట్లు పంపిణీ చేసి పెద్ద మనసు చాటుకున్న ముఖ్యమంత్రి జగన్ కు వారంతా రుణపడి ఉంటారని ఎంపీ వ్యాఖ్యానించారు.
ఒక్కడికే దిక్కులేదు..
వైసీపీకే చెందిన మరో కీలక నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సైతం నారా లోకేశ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరిన సందర్భంలో ‘‘ఒక్కరు పోతే వంద మంది నాయకులను తయారు చేసుకునే సత్తా టీడీపీకి ఉంది''అని చంద్రబాబు వ్యాఖ్యానించడం తెలిసిందే. దానికి అంబటి తనదైన శైలిలో.. ‘‘బాబుగారూ వంద మందిదాకా ఎందుకు? మీ పుత్నరత్నం లోకేశ్ ను మంచి నాయకుడిగా తీర్చిదిద్దండి.. అతను ప్రతిసారి ఎందుకు ఫెయిలవుతున్నాడో చెప్పగలరా?''అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులేగానీ, తుది తీర్పుకాదన్న సంగతి అందరూ గర్తుంచుకోవాలని అంబటి అన్నారు.
సీఎం జగన్ కు కేంద్రం షాక్ ఇందుకే..జైల్లోనే డిసైడయ్యారు.. వైసీపీలో కులవివక్షపై టీడీపీ స్క్రీన్ షాట్స్