కర్ణాటక మంత్రివర్గంపై డబుల్ ఇంజిన్ ముద్ర
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాపై పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. 24 మంది శాసన సభ్యులు- ఇవ్వాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:45 నిమిషాలకు రాజ్భవన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తొలిదశలో వారిద్దరితో పాటు ఎనిమిది- డాక్టర్ జీ పరమేశ్వర, కే హెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వారికి శాఖలను ఇంకా కేటాయించలేదు. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తరువాత శాఖలన కేటాయిస్తామంటూ అప్పట్లోనే ప్రకటించారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాతో ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు వారి పర్యటన కొనసాగింది. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు.
జాబితాపై ఆమోదముద్ర లభించిన తరువాత శుక్రవారం రాత్రి వారిద్దరూ బెంగళూరుకు చేరుకున్నారు. ఇవ్వాళ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా నిర్దేశించుకున్న 28 మందికి అదనంగా మరో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గ విస్తరణలో సిద్ధరామయ్య- డీకే శివకుమార్ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ జాబితాలో- హెచ్కే పాటిల్, కృష్ణ బైరేగౌడ, ఎన్ చలువరాయస్వామి, కే వెంకటేష్, డాక్టర్ హెచ్సీ మహదేవప్ప, ఈశ్వర్ ఖండ్రే, క్యాథసంద్ర ఎన్ రాజన్న, దినేష్ గుండూరావు, శరణ బసప్ప దర్శనాపుర, శివానంద పాటిల్, తిమ్మాపుర రామప్ప బాలప్ప, ఎస్ ఎస్ మల్లికార్జున, తంగడగి శివరాజ్ శానప్ప, డాక్టర్ శరణ ప్రకాష్ రుద్రప్ప పాటిల్, మంకాల్ వైద్య, లక్ష్మీ హెబ్బాళ్కర్, రహీం ఖాన్, డీ సుధాకర్, సంతోష్ ఎల్ లాడ్, ఎన్ఎస్ బోసెరాజు, సురేష బీఎస్, మధు బంగారప్ప, డాక్టర్ ఎంసీ సుధాకర్, బీ నాగేంద్ర ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అండగా ఉన్న లింగాయత్, వక్కలిగ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఎనిమిదికి మంత్రివర్గంలో చోటు లభించింది. వక్కలిగ-5, ఎస్సీ-5, ఎస్టీ-3, కురుబ-2, ముస్లిం-3 మంత్రిపదవులు కేటాయించారు. బ్రాహ్మణ, క్రైస్తవ, జైన, మరాఠీ, భోవి, మొగవీర, ఈడిగ, ఓబీసీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారిని ఒక్కొక్కరు చొప్పున మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నయా డబుల్ ఇంజిన్ సిద్ధరామయ్య-డీకే శివకుమార్ ముద్ర- మంత్రివర్గ సామాజిక కూర్పుపై కనిపించింది.












Click it and Unblock the Notifications